తెలంగాణ భవన్లో సెప్టెంబర్ 7, సోమవారం సాయంత్రం టిఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ కీలక ప్రసంగం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం దిశానిర్దేశం చేశారు. అలాగే జాతీయ పార్టీ ఏర్పాటుపై వస్తున్న వార్తలపై కూడా సీఎం స్పందించారు. జాతీయ స్థాయిలో రాజకీయ నాయకత్వ శూన్యత ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి జాతీయ పార్టీ పెట్టే ఆలోచన లేదని అన్నారు. జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటే, ఆ సమయం వచ్చినపుడు అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని సీఎం కేసీఆర్ తెలిపారు.
అదేవిధంగా జీహెఛ్ఎంసీ ఎన్నికల గురించి మాట్లాడుతూ, ఇప్పటికే మూడు రకాల సర్వేలు నిర్వహించగా 94 నుంచి 104 స్థానాలు పార్టీకి వస్తాయని తేలిందన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని, లక్ష ఓట్ల మెజారిటీతో ఆ స్థానాన్ని గెలుచుకుంటామని చెప్పారు. ప్రతిపక్షాలు చేసే ప్రచారానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సభ్యులకు వివరించారు. కొత్త రెవెన్యూ బిల్లును శాసనసభలో ప్రవేశపెడుతున్నామని, దేశం మరోసారి తెలంగాణ వైపు చూసేలా ఈ చట్టం రూపుదిద్దుకుందని అన్నారు. ఈ కొత్త రెవెన్యూ చట్టం గురించి ప్రజలకు ఎమ్మెల్యేలు వివరించాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఈ సమావేశం ప్రారంభంలోనే ఇటీవల మరణించిన దుబ్బాక ఎమ్మెల్యే సొలిపేట రామలింగారెడ్డికి టిఆర్ఎస్ శాసనసభాపక్షం సంతాపం తెలిపింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu