తెలంగాణ రాష్ట్రం నుండి ఇప్పటి వరకు 1.22 లక్షల వలస కార్మికులను 88 ప్రత్యేక రైళ్ల ద్వారా వివిధ రైల్వేస్టేషన్ల నుండి వారి స్వరాష్ట్రాలకు తరలించామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. మే 23, శనివారం నాడు నాంపల్లి రైల్వేస్టేషన్ వద్ద వలస కార్మికుల ప్రత్యేక రైలు ను సీఎస్ సోమేశ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రోజు నాంపల్లి రైల్వేస్టేషన్ నుండి 6 రైళ్లు వివిధ ప్రాంతాలకు వెళ్తున్నాయని, మరో 40 రైళ్లు వివిధ రైల్వేస్టేషన్ల నుండి ఇతర రాష్ట్రాలకు పంపుతున్నట్లు తెలిపారు. ఈ రైళ్ల ద్వారా దాదాపు 50 వేల మంది వలస కార్మికులను వివిధ ప్రాంతాలకు రవాణా చేయనున్నట్లు తెలిపారు. వలస కార్మికులకు రైల్వే శాఖ నుంచి ఆహారాన్ని అందిస్తున్నారని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కార్మికునికి రెండు ఆహార పొట్లాలు, 3 లీటర్ల త్రాగు నీరు, పండ్లను అందిస్తుందన్నారు. సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, వలస కార్మికుల తరలింపు కార్యక్రమాన్ని సమర్ధవంతంగా సమన్వయంతో మానిటరింగ్ చేసి కృషి చేసినందుకు పోలీస్ అధికారులను, ఇతర శాఖల అధికారులను అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద రిజిష్టర్ అయిన వలస కార్మికులందరిని శనివారంతో వారి స్వరాష్ట్రాలకు పంపించినట్లు తెలిపారు. వీరిలో చాలా మంది తెలంగాణకు తిరిగి రావటానికి సుముఖంగా వున్నట్లు కార్మికులు తెలిపారని సీఎస్ అన్నారు.
ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర పునఃనిర్మాణం లో వలస కార్మికులు ఒక భాగం అని తెలిపారు. ఆపదలో ఉన్న వలస కార్మికులందరు సురక్షితంగా వారి సొంత పట్టణాలకు గౌరవప్రదంగా పంపించడం తనకు సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ ఆదనపు డి.జి. (లా&ఆర్డర్) జితేందర్, మునిసిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, జి.హెచ్.యం.సి కమీషనర్ లోకేశ్ కుమార్, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్ధిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, రంగారెడ్డి జిల్లా జాయిట్ కలెక్టర్ హరీశ్ తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu