తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ నెల 25వ తేదీన ధరణి పోర్టల్ ను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలియజేసారు. శనివారం నాడు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, తహసీల్దార్లు, నాయిబ్ తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధరణి పోర్టల్ పనితీరుపై ప్రెజెంటేషన్ రూపంలో సీఎస్ వివరణాత్మకంగా వివరించారు. ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, ధరణి పోర్టల్ సేవలు పారదర్శకంగా, జవాబుదారీతనం, భద్రత, రక్షణ, సులభతరంగా మరియు విచక్షణాధికారాలు లేకుండా ఉంటాయని, ఇది వినూత్నమైనదని దేశంలోనే ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుందని అన్నారు.
సీఎం కేసీఆర్ విజన్ మేరకు ధరణి పోర్టల్ పారదర్శకంగా పనిచేయడంతో పాటు విచక్షణ అధికారాల దుర్వినియోగాన్ని తొలగిస్తుందన్నారు. ఈ పోర్టల్ ద్వారా 570 మండలాల్లో తహసీల్దార్లు జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా పనిచేస్తారని, 142 ప్రాంతాలలో సబ్ రిజిస్ట్రార్లు వ్యవసాయేతర ఆస్తులను రిజిస్ట్రేషన్ చేస్తారని సీఎస్ అన్నారు. ధరణి పోర్టల్ కార్యకలాపాలకు అవసరమైన సిబ్బంది, వసతులతో 100 శాతం సంసిద్దంగా ఉండాలని సీఎస్ జిల్లా కలెక్టర్లను ఈ సందర్భంగా కోరారు. రేపటిలోగా తహసీల్దార్లందరూ ప్రయోగాత్మకంగా ధరణి పోర్టల్ ద్వారా కనీసం 10 లావాదేవీలను చేపట్టాలన్నారు. ధరణి పోర్టల్ పూర్తిస్థాయిలో పని చేసేలా అవసరమైన హార్డ్ వేర్ సౌకర్యాలను సమకూర్చుకోవాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు మరియు ధరణి సేవలలో ఎటువంటి అంతరాయాలు ఏర్పడకుండా డిస్కం, బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, టి.ఎస్.టి.ఎస్ ప్రతినిధులతో నిరంతర సమన్వయ సమావేశాలు నిర్వహించుకోవాలన్నారు. ధరణి పోర్టల్ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి తహసీల్దార్లు సిద్దంగా ఉండడంతో పాటు అందుకు అనుగుణంగా పనిచేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ సూచించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu