తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీరాజ్ సంస్థల్లో ఖాళీగా వున్న వార్డు మెంబర్లు, సర్పంచ్, ఎంపీటీసీలు, జెడ్పిటీసీలు మరియు మున్సిపాలిటీలలోని వార్డు సభ్యుల భర్తీకై వార్డు వారీగా ఓటర్ల జాబితా తయారు చేసి ప్రచురించే అంశంపై రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పార్థసారథి ఆయా జిల్లాల కలెక్టర్ లు, అడిషనల్ కలెక్టర్లు, జిల్లాపరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులు, మున్సిపల్ కమీషనర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పార్థసారథి మాట్లాడుతూ, జనవరి 1, 2022 ప్రాతిపదికగా జనవరి 6,2022 నాడు భారత ఎన్నికల సంఘం అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా ప్రచురించిన ఓటర్ల జాబితా ఆధారంగా ఈ స్థానిక సంస్థల ఓటర్ల జాబితాలు తయారు చేసి ఏప్రిల్ 21, 2022 నాడు ప్రచురించాలని ఆదేశాలు ఇచ్చారు. ఓటర్ల జాబితా తయారుచేసే సమయలో వార్డుల వారీగా సాధారణ ఎన్నికలలో ఏర్పరుచుకున్న వార్డు సరిహద్దులను తప్పక పాటించాలని, ఎట్టి పరిస్థితులలో కూడా ఒక వార్డు ఓటరును ఇంకొక వార్డులో చేర్చరాదని సూచించారు.
ఏప్రిల్ 8న ముసాయిదా ఓటర్ల జాబితా:
ముందుగా ముసాయిదా ఓటర్ల జాబితాను ఏప్రిల్ 8, 2022 నాడు ప్రచురించి దానిపై అభ్యంతరాలు ఏవైనా వుంటే స్వీకరించి పరిష్కరించాలని, ఈ ముసాయిదా జాబితాపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశము నిర్వహించి వారి సలహాలను, అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరించాలని చెప్పారు. ఓటర్ల జాబితా ఎలాంటి పొరపాట్లు లేకుండా పక్కాగా తయారు చేసినట్లయితే ఎన్నికలు ఎలాంటి తప్పిదాలు జరగకుండా సాఫీగా జరుగుతాయని తెలిపారు. ఈ ఓటర్ల జాబితాలు సిద్ధమైన తర్వాత ఎన్నికల కమీషన్ పోలింగ్ స్టేషన్ ల గుర్తింపు, ప్రచురణ కొరకు నోటిఫికేషన్ జారీ చేస్తుందని, రాష్ట్ర పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అనుమతిని పొంది ఎన్నికల నిర్వహణకు తేదీలను ఖరారు చేస్తుందని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ