కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ను ఏప్రిల్ 30 వ తేదీ వరకు పొడిగిస్తునట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రంలో లాక్డౌన్ పొడిగింపుపై తెలంగాణ ప్రభుత్వం ఆదివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు కరోనా వ్యాప్తి నివారణకు చేపడుతున్న చర్యలు, వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స, లాక్ డౌన్ అమలవుతున్న తీరు, పేదలకు అందుతున్నసాయం, పంటల కొనుగోళ్లు జరుగుతున్న పద్ధతిపై ఏప్రిల్ 12, ఆదివారం నాడు సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువ అవుతున్నందున ప్రజలు మరింత జాగ్రత్తగా, అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
“ప్రపంచ, దేశ, తెలంగాణ వ్యాప్తంగా పరిణామాలు గమనిస్తుంటే కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదని స్పష్టం అవుతుంది. గణనీయ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో కొత్తగా 28 పాజిటివ్ కేసులు రాగా, ఇద్దరు మృతి చెందారు. ఇటువంటి పరిస్థితి ఉన్నందునే లాక్డౌన్ పొడిగింపు నిర్ణయం తీసుకున్నాం. పరిస్థితి తీవ్రతను ప్రజలు అర్థం చేసుకోవాలి. వీలైనంత వరకు ఇళ్లకే పరిమితం కావాలి. బయటకు వెళ్లాల్సివస్తే తప్పక సామాజిక దూరం పాటించాలి. వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం. కరోనా వైరస్ సోకిన వ్యక్తులున్న ప్రాంతాలను గుర్తించి, ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్నది. ప్రజలు దానికి సహకరించాలి. కరోనా వ్యాప్తి నివారణ అన్నది కేవలం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రజలు తు.చ. తప్పకుండా పాటించడం వల్ల మాత్రమే సాధ్యమవుతుందని” సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
“ఈ సమయంలో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరికి లక్షణాలు కనిపించినా పరీక్షలు నిర్వహించాలి. పాజిటివ్ వచ్చిన వారి కాంటాక్ట్స్ వివరాలు సేకరించి, వారికీ పరీక్షలు నిర్వహించాలి. అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద తనిఖీలు ఎక్కువ చేయాలి. నియంత్రణ పెంచాలి. ఇంకా ఎవరైనా తెలిసో తెలియకో పరీక్షలు చేయించుకోకుంటే వారే స్వయంగా వచ్చి పరీక్షలు చేయించుకోవాలి. ఇది వారి కోసం, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం చెబుతున్న మాటలు. ప్రజల నిరంతర అప్రమత్తత, స్వీయనియంత్రణపైనే కరోనా వ్యాప్తి నివారణ సాధ్యం అవుతుందని” సీఎం కేసీఆర్ చెప్పారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu