తెలంగాణ రాష్ట్రంలో విపత్తులు లేదా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్ల పింఛన్లలో కోత విధించేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. విపత్తులు, ఏదైనా అత్యవసర పరిస్థితి పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, స్థానిక సంస్థల ఉద్యోగుల వేతనాలుతో పాటుగా పెన్షనర్ల పింఛన్లలో కూడా గరిష్ఠంగా 50శాతం కోత విధించేలా ఆర్డినెన్స్ రూపొందించిన ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇలా కోత విధించిన మొత్తాన్ని ఆర్నెల్ల లోపు ఉద్యోగులు, పెన్షనర్లకు తిరిగి చెల్లించాలని నిర్ణయించారు. మార్చి 24 వ తేదీ నుంచే ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చినట్టుగా గెజిట్ నోటిఫికేషన్ లో ప్రభుత్వం స్పష్టం చేసింది.
కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో రెండు నెలల పాటుగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం పడడంతో ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ ఉద్యోగులకు ,పెన్షనర్లకు మార్చ్, ఏప్రిల్, మే నెలలకు సంబంధించి జీతాలలో కొంత శాతం కోత విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పెన్షనర్లకు పూర్తి పింఛను చెల్లించాలంటూ కొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, విచారణలో భాగంగా ఏ చట్ట ప్రకారం పెన్షనర్లకు కోత విధిస్తున్నారంటూ ఇటీవలే హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులు, పెన్షనర్ల జీతాల కోతపై రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu