తెలంగాణ రాష్ట్రంలో త్వరలో పురపాలిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలకోసం రిజర్వేషన్ల పక్రియపై గత కొన్నిరోజులుగా కసరత్తు జరుగుతుంది. ఈ నేపథ్యంలో జనవరి 4, శనివారం నాటితో పురపాలక రిజర్వేషన్ల మొదటి దశ ప్రక్రియ పూర్తైనట్టుగా తెలిపారు. ఆయా వర్గాలవారీగా నగరపాలక, మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు పక్రియను పూర్తి చేశారు. ఈ మేరకు నిర్ణయించిన రిజర్వేషన్ల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు పంపించింది. 2011 జనాభా లెక్కల ప్రకారమే ప్రభుత్వం ఎస్టీ, ఎస్సీలకు వార్డు పదవుల్లో రిజర్వేషన్లు కేటాయించింది. అలాగే ఎస్టీల జనాభా ఒక్కశాతం తక్కువున్నా సరే కార్పోరేషన్లు, మున్సిపాల్టీల్లోనూ ఒక వార్డు ఎస్టీలకు కేటాయించారు. అదేవిధంగా 50 శాతానికి మించకుండా బీసీలకు మిగతా రిజర్వేషన్లు కల్పించారు. జనవరి 5, ఆదివారం నాడు వార్డుల వారీ రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. మరోవైపు రాష్ట్రంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార టిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ మరియు ఇతర ప్రతిపక్ష పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.
[subscribe]