ప్రపంచవ్యాప్తంగా ఫార్ములా వన్ రేస్ తర్వాత అంతటి ఆదరణ దక్కించుకున్న ఫార్ములా-ఈ ప్రపంచ చాంపియన్షిప్కు భారతదేశం తొలిసారి ఆతిథ్యమిస్తోంది. అందునా మన హైదరాబాద్ నగరంలో ఈ ఈవెంట్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం ఫార్ములా-ఈ రేస్ ఛాంపియన్షిప్ మెగా ఈవెంట్ ప్రధాన రేస్ నిర్వహించనున్నారు. దీంతో హుస్సేన్సాగర్ తీరంలోని ఎన్టీఆర్ మార్గ్ ఈ-కార్ల రేసుతో సందడిగా మారనుంది. కర్బన ఉద్గారాలు, చెవులు చిల్లులుపడే శబ్దాలు లేకుండా నిశ్శబ్దంగా కార్లు సర్క్యూట్పై దూసుకెళ్లే నయా టెక్నాలజీ రేస్ కోసం హుస్సేన్ సాగర్ చుట్టూ మలుపులతో కూడిన ట్రాక్ ఇప్పటికే సిద్ధమైంది. ఇక ప్రధాన రేస్ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు జరగనుండగా.. అంతకుముందు ప్రీ ప్రాక్టీస్ రేస్లు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా రెండో ప్రీ ప్రాక్టీస్ రేస్ కొనసాగుతోంది. ఇక ఉదయం 10.40 గంటలకు అర్హత పోటీలు నిర్వహించనున్న క్రమంలో అందులో క్వాలిఫై అయిన రేసర్లు.. మధ్యాహ్నం ప్రధాన రేసులో చాంపియన్షిప్ కోసం పోటీపడనున్నారు.
ఈ నేపథ్యంలో రేసింగ్ నిర్వహించే ఎన్టీఆర్ మార్గ్, సచివాలయం, మింట్కాంపౌండ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ తదితర పరిసర ప్రాంతాలను పూర్తిగా మూసివేశారు. 300 మంది సివిల్, 270 మంది ట్రాఫిక్ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ట్రాఫిక్ను నియంత్రించడానికి మరో 600 మందిని నియమించారు. ఇక హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఇటీవలే ఆరంభించిన ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను పార్కింగ్ ప్రదేశాలనుంచి రేసింగ్ ట్రాక్ వద్దకు నడపనున్నారు. మధ్యాహ్నం 3.04 నుంచి ప్రధాన రేస్ జరుగనుంది. అనంతరం సాయంత్రం 4.35 గంటలకు మీడియా సమావేశంలో రేస్కి సంబంధించిన విజేతల వివరాలను ప్రకటించనున్నారు. కాగా నిన్న సాయంత్రం తొలి ప్రీ ప్రాక్టీస్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రాక్టీస్ సెషన్ను తిలకించేందుకు పలువురు స్టార్లు వచ్చారు. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి, ప్రముఖ టాలీవుడ్ నటుడు మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్, అలాగే మరో అగ్ర నటుడు జూ.ఎన్టీఆర్ భార్య ప్రణతి తమ పిల్లలతో హాజరై సందడి చేశారు.
ఇక ఈ రేస్ కోసం నగరంలోని హుస్సేన్ సాగర్ తీరంలో ప్రత్యేకంగా హైదరాబాద్ స్ట్రీట్ సర్యూట్ పేరుతో ట్రాక్ ఏర్పాటు చేశారు. మొత్తం 18 మలుపులతో కూడిన 2.8 కిలోమీటర్ల ట్రాక్పై 11 జట్లు, ఒక్కో జట్టులో ఇద్దరు డ్రైవర్లు చొప్పున పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రేసును తిలకించేందుకు 22 వేల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. అలాగే ట్రాక్ చుట్టూ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ప్రసాద్ ఐమ్యాక్స్ వద్ద మీడియా గ్యాలరీ, అదే ప్రాంతంలో వీఐపీల కోసం గ్రీన్ లాంజ్, వీవీఐపీల కోసం ప్రత్యేకంగా ఏస్ లాంజ్ను రేస్ ముగింపు పాయింట్ వద్ద ఏర్పాటు చేశారు. అలాగే ప్రేక్షకుల కోసం 16 గ్యాలరీలు ఉండగా, చిన్నారుల కోసం విడిగా పీపుల్స్ ప్లాజాలో ఫ్యాన్ విలేజ్ వేదికను సిద్ధం చేశారు. ఇంకా రేసింగ్ ట్రాక్ను ఒకవైపు నుంచి మరో వైపుకు దాటేందుకు 4 చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జీలను తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. ఇక దేశ, విదేశాల నుంచి ప్రేక్షకులు హాజరవుతున్న క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా రేస్ పరిసర ప్రాంతాలపై పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE