తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం-నల్లగొండ-వరంగల్ మరియు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు మార్చి 14న పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ పక్రియను రేపు (మార్చి 17, బుధవారం) చేపట్టనున్నారు. రాష్ట్రంలోని టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వంటి ప్రధాన రాజకీయపార్టీలు ఈ ఎన్నికల కోసం పెద్దఎత్తున ప్రచారం నిర్వహించడంతో ఫలితాలపై ప్రజల్లో ఉత్కంఠ నెలకుంది.
ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానం ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ పక్రియ నల్గొండలో ఆర్జాలబావి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాంలో, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానం ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో జరుగనుంది. కౌంటింగ్ పక్రియ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ రెండు స్థానాలకు కలిపి మొత్తం 164 మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో కౌంటింగ్ పక్రియకు ఎక్కువ సమయం పట్టనుంది. కౌంటింగ్ కోసం మొత్తం 1,606 మంది సిబ్బందిని వినియోగించనున్నారు. ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానంలో 76.41 శాతం అనగా 3,86,320 మంది ఓటర్లు, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానంలో 67.26 శాతం అనగా 3,57,354 మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకున్నారు.
ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానంలో 71మంది మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ స్థానంలో టీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వర్రెడ్డి, కాంగ్రెస్ నుంచి రాములు నాయక్, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, తెలంగాణ జన సమితి నుంచి ఫ్రొఫెసర్ కోదండరాం, ఇండిపెండెంట్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పోటీలో ఉన్నారు. అలాగే హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానంలో 93 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ స్థానంలో టీఆర్ఎస్ నుంచి సురభి వాణిదేవి, కాంగ్రెస్ నుంచి చిన్నారెడ్డి, బీజేపీ నుంచి రామచంద్రరావు, టీడీపీ నుంచి ఎల్.రమణ, ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రొఫెసర్ నాగేశ్వర్ పోటీలో ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ