జగిత్యాల జిల్లా వాసులకు జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) గుడ్ న్యూస్ చెప్పింది. జిల్లా వాసులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మెడికల్ కాలేజీకి అనుమతి లభించింది. జగిత్యాలలో కొత్తగా నెలకొల్పిన ప్రభుత్వ మెడికల్ కాలేజీకి 150 ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేసింది. తెలంగాణలోని 33 జిల్లాలలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2022-23 వైద్య విద్య సంవత్సరంలో కొత్తగా 8 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించడానికి నిర్ణయించిన విషయం తెలిసిందే.
జగిత్యాలతో పాటు కొత్తగా సంగారెడ్డి, వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, మంచిర్యాల, రామగుండంలలో వైద్య కళాశాలల నిర్మాణానికి ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. ఈ 8 కళాశాలల్లో తొలి విడత తనిఖీల ప్రక్రియ పూర్తయింది. అయితే దీనిలో భాగంగా జగిత్యాల కళాశాలలోని లోపాలపై రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ నివేదిక పంపగా వాటిని సవరించిన తెలంగాణ ప్రభుత్వం రెండో విడత తనిఖీలకు ఆహ్వానించింది. ఈ క్రమంలో జగిత్యాలలో ఇటీవల మరోసారి పరిశీలించిన ఎన్ఎంసీ బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. కళాశాలలో లేబొరేటరీ, లైబ్రరీ, ఫ్యాకల్టీ, నర్సింగ్, పారామెడికల్ స్టాఫ్, హాస్టళ్లు తదితర వసతి సౌకర్యాలు నిబంధనల ప్రకారం ఉన్నాయని పేర్కొంది.
ఈ మేరకు కళాశాలకు అనుమతిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు మంగళవారం అధికారికంగా లేఖ పంపింది. దీనిద్వారా తెలంగాణకు అదనంగా 150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుతో జిల్లా వాసులకు మెరుగైన వైద్యం అందుబాటులోకి రానుంది. అలాగే మిగిలిన 7 కళాశాలల్లో కొన్నింటిలో ఇప్పటికే రెండో విడత తనిఖీలు పూర్తయినట్లు మరికొన్నింటిలో ఈ నెలాఖరుకు పూర్తవుతాయని వైద్యవర్గాలు పేర్కొన్నాయి. ఆయా కళాశాలల్లో పెండింగ్ లో ఉన్న పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టిందని, 2022-23 విద్యా సంవత్సరం నుంచే ఈ వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభమవుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ