తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లోని రెండు కార్పొరేట్ ఆస్పత్రుల్లో పేదలకు ఉచిత కోటా కింద కేన్సర్ వైద్యం అందించాలని ఆదేశించింది. ఈ మేరకు అపోలోలో 15 శాతం, బసవతారకంలో 25 శాతం చొప్పున పేదలకు ఉచితంగా పడకలు కేటాయించాలని ప్రత్యేక జీవో జారీ చేసింది. ఈ రెండు ఆస్పత్రులు ఉచిత ఇన్ పేషంట్, ఔట్ పేషంట్ సేవలు అందించాలని జీవోలో స్పష్టం చేసింది. అలాగే దీనిపై డీఎంహెచ్ఓ పర్యవేక్షణ ఉంటుందని అందులో పేర్కొంది. కాగా దీనికి సంబంధించిన తాజా జీవో ప్రతిని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం తెలంగాణ హైకోర్టుకు సమర్పించింది.
అయితే ఈ రెండు ఆస్పత్రుల యాజమాన్యాలు తెలంగాణ ప్రభుత్వం నుంచి తక్కువ ధరకు భూమిని తీసుకున్నాయని, ఆ సమయంలో జరిగిన ఎంవోయూల మేరకు ఈ ప్రైవేట్ ఆస్పత్రులు పేదలకు ఉచిత వైద్య సేవలు అందించాల్సి ఉండగా, ఇది అమలవడం లేదని.. పేదలకు ఉచిత వైద్యం అందజేయాలని, కనీసం కరోనా విపత్కర కాలంలోనైనా దీన్ని అమలు చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఓమిమ్ మానెక్షా డెబారా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సూరేపల్లి నందా ధర్మాసనం విచారణ జరిపింది. ఇక దీనిపై తుది ఉత్తర్వుల నిమిత్తం విచారణను హైకోర్టు ఆగస్టు 2కి వాయిదా వేసింది.
ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున ఏజీ తన వాదనలు వినిపిస్తూ.. అపోలోకు భూమి ఇచ్చినప్పుడు 15% బెడ్స్ పేదలకు ఉచిత కేటాయించేలా ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం మేరకు 1981లో జీవో 517 జారీ అయ్యిందని కోర్టుకు విన్నవించారు. ఇక బసవతారకం ఆస్పత్రికి 7.35 ఎకరాలను 1989లో ప్రభుత్వం ఏడాదికి రూ.50 వేలకు లీజుకు ఇచ్చినందుకు గాను 25% పడకలు కేటాయించేలా, అలాగే రోజూ 40% ఔట్పేషంట్లకు ఉచిత వైద్యం చేసేలా 1989లో జీవో 437 జారీ అయ్యిందని తెలియజేశారు. ఎంఓయూల ప్రకారం ఈ రెండు ఆస్పత్రులు పేదలకు ఉచితంగా పడకలను కేటాయించి వైద్యం చేయకపోతే రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుంటారని, జరిమానా విధించే అవకాశం కూడా ఉందని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ