అధికార టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరాల వ్యవహారం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. బుధవారం రాత్రి నగరంలోని మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో అజీజ్ నగర్ లోని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కి చెందిన ఫామ్ హౌజ్ లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయిన గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డిలను టీఆర్ఎస్ ను వీడి, వేరే పార్టీలో చేరేందుకు ఫామ్ హౌజ్ లో చర్చలు జరుపుతుండగా, సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని, చర్చలు జరుపుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం ఆ ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి శంషాబాద్ డీసీపీ కార్యాలయానికి తరలించారు. గురువారం వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించే అవకాశముంది. ఫామ్ హౌజ్ లో వీరి నుండి రూ.15 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేసినట్టు తెలుస్తుంది. అరెస్ట్ అయిన వారిలో ఫరీదాబాద్ చెందిన రామచంద్రభారతి/సతీష్ శర్మ, తిరుపతికి చెందిన సింహయాజి, హైదరాబాద్ నగరానికి చెందిన నందకుమార్ ఉన్నారు. కాగా వీరంతా బీజేపీకి చెందిన వ్యక్తులని, ప్రముఖ బీజేపీ నేతలతో వీరు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో బుధవారం రాత్రి నుంచి వైరల్ అవుతున్నాయి.
ఈ ఘటనపై సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమాచారంతోనే ఫామ్ హౌజ్ పై రైడ్ చేశామని చెప్పారు. నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్నారనే సమాచారం తమకు వచ్చిందని, డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామని ముగ్గురు వ్యక్తులు ప్రలోభ పెడుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పారని స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు. ఫరీదాబాద్ కు చెందిన రామచంద్ర భారతి, తిరుపతికి చెందిన సింహయాజీ అనే ఓ స్వామిజీ, హైదరాబాద్కు చెందిన నందకుమార్తో కలిసి ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నారన్నారు. పార్టీ ఫిరాయింపు చేయాలని వారు అడిగారని ఎమ్మెల్యేలు సమాచారం ఇచ్చారన్నారు. ఎమ్మెల్యేల ప్రలోభాల ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని, అన్ని వివరాలు వెల్లడిస్తామని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
మరోవైపు ఈ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురు వ్యక్తులను రహస్య ప్రాంతాల్లో ఉంచి విచారణ చేస్తునట్టు తెలుస్తుంది. వారి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని, ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలలో ఎవరెవరు ఉన్నారు? ఎవరితో మాట్లాడించారు? ఎన్ని రోజులుగా వారు ఎమ్యెల్యేలతో సంప్రదింపులతో ఉన్నారనే అంశాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తునట్టు సమాచారం. అలాగే ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌజ్ ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని మరోసారి పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టారు. డబ్బు అంశంపై స్పష్టత రాకపోవడంతో ఎక్కడైనా దాచారేమోనని తనిఖీలు జరుపుతున్నట్టు సమాచారం. అలాగే నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ మారేందుకు ప్రలోభపెట్టే సమయంలో మాట్లాడిన ఆడియో రికార్డింగ్ టేప్స్ కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. అవి ఇంకా బహిర్గతం కాలేదు. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పోలీసులు గురువారం మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY