ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం గృహ నిర్మాణశాఖపై కీలక సమీక్ష నిర్వహించారు. టిడ్కో ఇళ్లు నిర్వహణ, కాలనీల్లో మౌలిక సదుపాయాలు, విశాఖలో మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలు సహా పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ముందుగా రాష్ట్రంలో గృహ నిర్మాణంలో పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. వర్షాలు తగ్గినందున వేగంగా పనులు ముందుకు సాగుతాయన్నారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో గృహనిర్మాణం కోసం రూ.5,005 కోట్లు ఖర్చు చేశామని, విశాఖలో మంజూరుచేసిన ఇళ్ల నిర్మాణాలపైనా ప్రత్యేక దృష్టిపెడుతున్నామని అధికారులు తెలిపారు. కాలనీల్లో మౌలిక సదుపాయాలు, విద్యుద్దీకరణ పనులు కూడా సమాంతరంగా కొనసాగుతున్నాయన్నారు. ఇక టిడ్కో ఇళ్లలో ఇప్పటికే 40,576 ఇళ్లు లబ్ధిదారులకు అప్పగించామని, డిసెంబర్ కల్లా 1,10,672 ఇళ్లు లబ్ధిదారులకు అందజేయనున్నట్టు అధికారులు తెలిపారు. అలాగే మార్చికల్లా మరో 1,10,968 ఇళ్లు అప్పగిస్తామని చెప్పారు. ఫేజ్–1కు సంబంధించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా దాదాపుగా ముగిసిందన్నారు.
అనంతరం సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, టిడ్కో ఇళ్లు నిర్వహణ బాగుండాలని సూచించారు. టిడ్కో ఇళ్లను పట్టించుకోకపోతే మళ్లీ మురికి వాడలుగా మారే ప్రమాదం ఉంటుందన్నారు. ఏ విధంగా ఆ ఇళ్లను నిర్వహించుకోవాలన్నదానిపై అసోసియేషన్లకు బాసటగా నిలవాలని అధికారులకు సీఎం సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఏపీఎస్హెచ్సీఎల్ ఛైర్మన్ దవులూరి దొరబాబు, ఏపీ టిడ్కో ఛైర్మన్ జమ్మాన ప్రసన్న కుమార్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY