తెలంగాణలో మరికొన్ని రోజుల్లో మునుగోడు ఉపఎన్నిక జరుగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారంటూ వీడియో ఒకటి వెలుగు చూడటం కలకలం రేపింది. ఈ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దీనివెనుక బీజేపీ పెద్దలున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ ఆరోపణలపై స్పందించారు. బుధవారం రాత్రి నల్లగొండ జిల్లా మునుగోడు మండలం తిరగండ్లపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సంజయ్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు మొయినాబాద్ లోని ఫాంహౌస్ కు వచ్చిన వారు బీజేపీ నేతలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీసేందుకే ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా జరిగిందని ఆరోపించారు. అసలు ఆ ఫాంహస్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేదేనని, ఫిర్యాదు చేసింది కూడా వాళ్లేనని సంజయ్ అన్నారు.
మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటమి తప్పదని తేలిపోవడంతో సీఎం కేసీఆర్ ఈ డ్రామాకు తెర తీశారని, ఆయనకు కొందరు పోలీసులు సహకరించారని బండి సంజయ్ విమర్శించారు. ఈ వ్యవహారంలో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని, ఆ పార్టీ ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం తమ పార్టీకి లేదని స్పష్టం చేశారు. దీనిపై తనతోపాటు రాష్ట్ర బీజేపీ నేతలంతా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్దకు వచ్చి ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, సీఎం కేసీఆర్ కూడా యాదగిరిగుట్టకు వచ్చి ప్రమాణం చేయాలని సంజయ్ సవాల్ విసిరారు. ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఈ డ్రామాకు తెరదీసిన టీఆర్ఎస్ను రాజకీయ సమాధి చేస్తామని హెచ్చరించారు. స్వామిజీలను ఇలాంటి కేసుల్లో ఇరికిస్తారా? హిందూ ధర్మమంటే అంత చులకనా? అని ప్రశ్నించారు. ఇక ఈ వ్యవహారానికి సంబంధించి ఫామ్హౌస్లో, హోటల్లో, ప్రగతిభవన్లో గత వారం రోజుల సీసీటీవీల ఫుటేజీలను బయటపెట్టాలని, అదేవిధంగా దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపించాలని డిమాండ్ చేశారు. ఈ కొనుగోలు డ్రామా అంతా సీఎం కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే చెబుతున్నారని, బీజేపీని బద్నామ్ చేయడానికే ఇలాంటి కుట్రలకు తెర తీస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY