అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యం నినాదంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకెళ్తోందని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు. ఈ మేరకు ఆయన గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కంటి వెలుగు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కంటి పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు కళ్ళ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడకుండా సీఎం కేసీఆర్ ‘కంటి వెలుగు’ అనే అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఈ నేపథ్యంలో కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 50 లక్షల మందికి పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు. ఈ కార్యక్రమంతో ప్రజలకు ఆనంద భాష్పాలు, ప్రతి పక్షాలకు కన్నీటి భాష్పాలు వస్తున్నాయని మంత్రి పరిహాసమాడారు.
ఇక దీనికోసం ప్రజలు ఆస్పత్రుల వద్దకు రావడం కాదని, వారి వద్దకే ప్రభుత్వం కదిలి వస్తోందని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఉచితంగా కంప్యూటరైజ్డ్ కంటి పరీక్షలు నిర్వహించడమే కాకుండా అవసరమైన మేరకు మందులు, కళ్లద్దాలు కూడా పంపిణీ చేస్తోందని తెలిపారు. కంటి వెలుగును ప్రపంచంలోనే ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న అతిపెద్ద కార్యక్రమంగా నిలిపేందుకు సమస్త యంత్రాంగం కృషి చేస్తోందని, వేలాదిమంది సిబ్బంది అనునిత్యం సేవలందిస్తున్నారని మంత్రి కొనియాడారు. ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం 50 లక్షల మందిలో 34 లక్షల మందికి ఎలాంటి సమస్యలు లేవని, మిగిలిన 16 లక్షల మందికి కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ 16 లక్షల మందిలో 9,35,512 మందికి అక్కడికక్కడే రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేశామని, అలాగే ప్రిస్కిప్షన్ గ్లాసెస్ రిఫర్ చేసిన 6,49,507 మందిలో 54,324 మందికి ఇంటికి వెళ్లి మరీ కళ్లద్దాలు అందించామని వెల్లడించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 30 లక్షల రీడింగ్ గ్లాసెస్ మరియు 25 లక్షల ప్రిస్కిప్షన్ గ్లాసెస్ అవసరమైన వారికి ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి హరీశ్ రావు తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE