గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలను బ్యాలెట్ బాక్స్ లు మరియు బ్యాలెట్ పేపర్ల విధానంలోనే నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే రాష్ట్రంలో ఎన్నికలు జరగాల్సిన స్థానిక సంస్థల్లో కూడా బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికల పక్రియ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుత కరోనా మహమ్మారి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అయితే ముందుగా ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతోనా లేదా ఈవీఎంలతో నిర్వహించాలా అనే అంశంపై రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకున్నారు.
రాష్ట్రంలో గుర్తింపు పొందిన 11 రాజకీయ పార్టీలలో 8 పార్టీలు అభిప్రాయాలు వెల్లడించాయని, అందులో 5 పార్టీలు బ్యాలెట్ విధానానికే మొగ్గు చూపగా, ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని 1 పార్టీ కోరిందని, మిగతా రెండు స్పష్టమైన అభిప్రాయం ఇవ్వలేదని చెప్పారు. అలాగే గుర్తు లేకుండా నమోదైన 39 రాజకీయ పార్టీలలో 18 పార్టీలు అభిప్రాయాలు తెలుపగా, 11 పార్టీలు బ్యాలెట్ విధానానికి 2 ఈవీఎంలకు మొగ్గుచూపగా, మిగతా 5 స్పష్టమైన అభిప్రాయం ఇవ్వలేదని పేర్కొన్నారు. ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలకమండలి పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీతో పూర్తికానుంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu