తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త అర్బన్,రూరల్, రెవిన్యూ పాలసీల రూపకల్పన పై మూడు రోజులుగా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. నూతన అర్బన్ పాలసీ లో భాగంగా నూతన మునిసిపల్ చట్టం, నూతన కార్పొరేషన్, మరియు హైదరాబాద్ నగర కార్పొరేషన్ చట్టం తీసుకురావడానికి అధికారులతో కలిసి చర్చిస్తున్నారు . కొత్తగా రూపొందే ఈ పురపాలక( మునిసిపల్) చట్టాలతోనే, ఎన్నికలకు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త పురపాలక బిల్లును ఆమోదించడం కొరకు జూలై 18, 19 వ తేదీల్లో శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.ఇప్పటికే సలహాల కోసం బిల్లు ముసాయిదా ను, న్యాయ శాఖ పరిశీలనకు పంపినట్టు సమాచారం, వారి పరిశీలన తరువాత మార్పులు చేర్పులు చేసి, తుది బిల్లును శాసన సభ మరియు శాసన మండలిలో ఆమోదించి, కొత్త చట్టానికి కార్యరూపం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది.
గురువారం ప్రగతి భవన్ నిర్వహించిన అధికారుల సమావేశంలో, పురపాలిక విభాగానికి కొత్త చట్టం రూపొందాకే, పురపాలక ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. తెలంగాణ లో రెండోసారి అధికారం సాధించినప్పటి నుండి, పారదర్శక పాలనా కోసం, అవినీతి రూపుమాపడం కోసం, ప్రజలకు ప్రభుత్వ సేవలు మెరుగుపరచడం కోసం, కొత్త రెవిన్యూ, పురపాలక, రూరల్ చట్టాలపై కెసిఆర్ కసరత్తు చేస్తున్నారు, త్వరలో కార్యరూపం దాల్చి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.