కరీంనగర్ జిల్లాలోని మల్యాల మండలం కొండగట్టు గ్రామం లోని చారిత్రాత్మక శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయానికి వేలాది మంది హనుమాన్ భక్తులు తరలివచ్చారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. హనుమాన్ ‘మాల’లు వేసుకున్న భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో అంజన్న దర్శనం కోసం వేచియున్న భక్తుల క్యూ కిలోమీటర్ పైగా సాగింది. మాలధారులు హనుమాన్ దీక్ష విరమణ చేయనున్న సందర్భంలో ఆలయానికి పెద్దఎత్తున చేరుకుంటున్నారు. స్వామివారి దర్శనానికి దాదాపు ఐదు గంటలకు పైగా సమయం పడుతుందని భక్తులు తెలిపారు. అయితే క్యూలైన్లలో బారికేడ్లు వేసి దర్శనం సజావుగా సాగేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
ఆలయ అధికారులు, పలు స్వచ్ఛంద సంస్థలు.. వేసవిని దృష్టిలో పెట్టుకుని దేవాలయం మరియు ఘాట్రోడ్డులో పలుచోట్ల వాటర్ కియోస్క్లు ఏర్పాటు చేసి తాగునీటిని అందించేందుకు ముందుకు వచ్చారు. గతంలో జరిగిన ప్రమాదాలను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు ఆలయానికి వాహనాల రాకపోకలను పరిమితం చేశారు. వాహనాలను గుడి పాదాలపైనే పార్కింగ్ చేయాల్సి వచ్చింది. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు అధికారులు కొత్తగా నిర్మించిన ట్యాంక్లో నీటిని నింపారు. అలాగే వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ (సీసీటీవీ) కెమెరాల ఏర్పాటు ద్వారా ఆలయ పరిసరాలపై దృష్టి పెట్టిన పోలీసులు అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లా ఎస్పీ సింధుశర్మ, అడిషనల్ ఎస్పీ రూపేష్ కుమార్ ఆధ్వర్యంలో కొండగట్టులో భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ కొనసాగుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ