తెలంగాణలోని ఎస్సీ,ఎస్టీతో పాటు కొన్ని జనరల్ కేటగిరి అసెంబ్లీ నియోజకవర్గాలలో దళితులు, ఆదివాసీలు ఎక్కువగానే ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరంలో నాలుగింట ఒక వంతు ఉన్న వీరే ఇప్పుడు కీలకపాత్ర పోషించబోతున్నారు. ఏకంగా 33 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీరే కీలకం అయ్యారు. అందుకే దళితులు, ఆదివాసీల ఓట్లను కైవసం చేసుకోవడానికి అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆకర్షనీయమైన హామీలతో వారిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాయి.
తెలంగాణలో ప్రత్యేకించి దళితులు, ఆదివాసీల మద్ధతు కోసమే అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు వారి వారి మేనిఫెస్టోల్లో చాలా పథకాలు ప్రకటించాయంటేనే ఈ ఎన్నికలలో వారి ప్రాధాన్యత ఎంతో అర్ధం అవుతుంది.తెలంగాణ జనాభాలో ఎస్సీలు 15.45 శాతం మంది ఉన్నట్లు తేలింది. 2011వ సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే ఎస్టీల నిష్పత్తి 9.08 శాతం ఉండగా.. ఆగస్టు 2018లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఎస్సీలు నిష్పత్తి 18 శాతం, ఎస్టీల నిష్పత్తి 10 శాతానికి పెరిగింది.
తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలను చూసుకుంటే.. 76 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం ఎస్సీ ఓటర్ల సంఖ్య 15 శాతానికి పైగా ఉన్నట్లు ఎన్నికల గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం 119 నియోజకవర్గాల్లోనూ 33 నియోజకవర్గాల్లో ఎస్టీ ఓటర్ల సంఖ్య 10% మించి ఉన్నట్లు లెక్కలు తేలాయి. దీంతో చాలా నియోజకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీ ఓటర్లే ఇప్పుడు కీలకంగా మారారు.అంతెందుకు 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎస్సీ,ఎస్టీ ఓట్లే బీఆర్ఎస్ భారీ విజయానికి కారణం అయ్యాయి.
కేసీఆర్ గవర్నమెంట్ తొమ్మిదన్నరేళ్లుగా అమలు చేసిన పథకాలను ..ఈ ఎన్నికలలో ప్రచారం చేస్తూ ఎస్సీ, ఎస్టీ ఓటర్ల మద్ధతు నిలుపుకుంటామనే ధీమాతో ఉంది. అంతేకాదు గతంలో వారికిచ్చిన హామీలను నిలుపుకోవడమే కాకుండా.. మరికొన్ని హామీలను కూడా జతచేయడంతో.. ఈ సారీ కూడా ఎస్సీ, ఎస్టీల ఓట్లు తమకే పడతాయని బీఆర్ఎస్ నమ్మకం పెట్టుకుంది.
ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్లో రూ.51,983 కోట్ల భారీ కేటాయింపులు చేసింది తెలంగాణ గవర్నమెంట్. ఈ కేటాయింపుల్లో ఎస్సీలకు ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్డిఎఫ్) కింద రూ.36,750 కోట్లు, ఎస్టీలకు ఎస్డిఎఫ్ కింద రూ.15,233 కోట్లు ఉన్నాయి. దళిత బంధు పథకాన్ని 2021 అక్టోబర్లో ప్రారంభించారు. ఈ సంవత్సరం బడ్జెట్లో 1.77 లక్షల దళిత కుటుంబాలకు రూ. 17,700 కోట్లు కేటాయించారు.
మరోవైపు తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ దళిత, ఆదివాసీ ఓట్లను చేజిక్కించుకోవడానికి తమ ప్రయత్నాలు చేస్తున్నాయి. బీఆర్ఎస్ను మించేలా వారి కోసం మేనిఫెస్టోలో వరాలు కురిపించాయి. దీంతో పోటాపోటీగా ఇచ్చిన నేతలు ఇచ్చిన హామీలు తమ విజయానికి ఎలా పనికొస్తాయో చూడాలంటే డిసెంబర్ 3 వరకూ వేచి చూడాల్సిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE