‘ఆకాశంలో సగం.. అవనిలో సగం’ అంటూ ఉపన్యాసాలిచ్చే రాజకీయ పార్టీ పెద్దలు ఆచరణలో ఆమెను ఆమడ దూరం పెడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సీట్ల కేటాయింపులో మహిళలకు అత్తెసరు సీట్లే కేటాయించారు. మహిళలకు చట్టసభలో 33 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందగానే తమ పార్టీ గొప్పతనమేనంటూ అందరూ గొప్పగా చెప్పుకున్నారు. ఎన్నికల్లో సీట్ల కేటాయింపునకు వచ్చే సరికి మొహం చాటేశారు.
ఉదాహరణకు గ్రేటర్ హైదరాబాద్లోని 24 నియోజకవర్గాలను పరిశీలిస్తే.. ప్రధాన పార్టీలు పోటీలో నిలిపిన మహిళలు ఏడుగురు మాత్రమే. అందులో కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు, బీఆర్ఎస్ తరఫున ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు బరిలో ఉన్నారు ఎంఐఎం ఒక్క స్థానాన్నీ మహిళలకు కేటాయించలేదు. బీఆర్ఎస్ తరపున పోటీలో ఉన్న మహిళల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి మంత్రి సబితా ఇంద్రారెడ్ది, కంటోన్మెంట్ ఎస్సీ రిజర్వు స్థానం నుంచి సాయన్న కుమార్తె లాస్య నందిత ఉన్నారు. గ్రేటర్లోని పలు స్థానాల నుంచి బీఆర్ఎస్కు చెందిన మహిళా నేతలు, పలువురు మహిళా కార్పొరేటర్లు టికెట్ కోసం పోటీపడగా వారి నిరాశే ఎదురైంది. 2018 ఎన్నికల్లో గ్రేటర్లో బీఆర్ఎస్ తరపున ఒక్క మహిళా అభ్యర్థికి టికెట్ ఇవ్వలేదు. ఈ సారి మాత్రం రెండు టికెట్లు కేటాయించడం గమనార్హం.
కాంగ్రెస్ పార్టీ నాలుగు స్థానాలను మహిళలకు కేటాయించింది. ఖైరతాబాద్ నుంచి పీజేఆర్ కూతురు విజయారెడ్డి, సనత్నగర్ నుంచి ఏఐసీసీ వర్కింగ్ కమిటీ సభ్యుడు పవన్ఖేరా భార్య కోట నీలిమ, కంటోన్మెంట్ నుంచి గద్దరు కూతురు జీవీ వెన్నెల, గోషామహల్ నుంచి టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు ఎం.సునీతరావును ఎన్నికల బరిలో ప్రత్యర్థులతో తలపడుతున్నారు. ఇక చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు తీసుకొచ్చిన బీజేపీ గ్రేటర్లో ప్రకటించిన 19 నియోజకవర్గాల్లో కేవలం ఒక్క స్థానాన్ని మాత్రమే మహిళకు కేటాయించింది. అది కూడా మైనార్టీలు అధికంగా ఉన్న పాతబస్తీలో మేఘారాణి అగర్వాల్ను బరిలో నిలిపింది. 2018లో చాంద్రాయణగుట్ట అభ్యర్థిగా ఏబీవీపీ విద్యార్థి నాయకురాలు సయ్యద్ సహేజాదికి బీజేపీ టికెట్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమెకు కూడా టికెట్ దక్కలేదు.
ఎంఐఎంలో మహిళలకు ప్రాధాన్యం ఎప్పుడూ తక్కువే. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడంతో 2015, 2020లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో 75 మందికి పైగా మహిళా కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం కూడా మహిళా అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలపాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్ లేకుంటే మహిళలకు ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో పరిస్థితే ఎదురయ్యేదని పలు మహిళా సంఘాలు అంటున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY