విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా కార్మికులు ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మద్ధతు తెలుపుతున్నట్లు ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. ఈ మేరకు ఆయన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఒక ప్రకటన చేశారు. “విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా పరిరక్షణ కమిటీ చేస్తున్న పోరాటానికి నా మద్దతు ప్రకటిస్తున్నాను. ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా మోగిన ఆనాటి నినాదాలు ఇంకా నా చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. నర్సాపురం వైయన్ఎం కాలేజీలో చదివే రోజుల్లో బ్రష్ చేతబట్టి గోడల మీద ‘విశాఖ ఉక్కు సాధిస్తాం’ అనే నినాదాన్ని రాశాం. హర్తాళ్లు, ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు చేశాం. దాదాపు 35 మంది పౌరులతో పాటు, 9 ఏళ్ల బాలుడు కూడా ప్రాణార్పణ చేసిన ఆనాటి మహోద్యమ త్యాగాల ఫలితంగా సాకారమైన విశాఖ ఉక్కు కర్మాగారం ఉత్పత్తి ప్రారంభమైనప్పుడు అందరం సంబరాలు చేసుకున్నాం. అది ఆంధ్రుల హక్కుగా, ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక గా భావించి సంతోషించాం. ‘విశాఖ ఉక్కు’కు దేశంలోనే ఓ ప్రత్యేకత, విశిష్టత ఉందని తెలిసి గర్వించాం” అని చిరంజీవి అన్నారు.
“విశాఖ ఉక్కు కర్మాగారానికి ఇన్నేళ్లయినా క్యాప్టివ్ మైన్స్ కేటాయించకపోవడం, అందువల్ల నష్టాలొస్తున్నాయనే సాకుతో పైవేటుపరం చేయాలనుకోవడం సమంజసం కాదు. లక్షలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన విశాఖ ఉక్కును ప్రయివేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసే ప్రయత్నాలను కేంద్రం విరమించు కోవాలని కోరుతున్నాను. ఉద్యోగస్థులు, కార్మికుల భవిష్యత్ ను, ప్రజల మనోభావాలను గౌరవించి కేంద్రం ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలి. విశాఖ ఉక్కును రక్షించుకోవడమే ఇప్పుడు మన ముందున్న ప్రధాన కర్తవ్యం. ఇది ప్రాంతాలకు, పార్టీలకు, రాజకీయాలకు అతీతమైన, న్యాయ సమ్మతమైన హక్కు, ఆ హక్కును ఉక్కు సంకల్పంతో కాపాడుకుందాం” చిరంజీవి పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ