తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ‘హాథ్ సే హాథ్ జోడో అభియాన్’ పాదయాత్రలో భాగంగా ఆయన సోమవారం జగిత్యాల జిల్లా, మల్యాల మండలం, ముత్యంపేట గ్రామానికి సమీపంలో ఉన్న అంజన్న ఆలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న రేవంత్ రెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ క్రమంలో రేవంత్ స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం పలికి ఆయనను దీవించారు. ఇక ఆలయ అధికారులు రేవంత్ రెడ్డికి శాలువా కప్పి సత్కరించి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వెంట తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు పలువురు ఉన్నారు.
ఇక స్వామివారి దర్శనానంతరం లయం వెలుపల రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గతంలో కొండగట్టు ఘాట్ రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదం ఘటనలో పలువురు భక్తులు మృతి చెందారని, అలాగే మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయని గుర్తు చేశారు. అయితే వీరెవరికీ ఇప్పటివరకూ ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి ఆర్ధిక సాయం అందలేదని, కనీసం దీనిపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. కొండగట్టులో భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ కలుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, రానున్న వేసవి దృష్ట్యా తగిన వసతులు కల్పించాలని కోరారు. ఇక ఇటీవలి తన పర్యటనలో కొండగట్టు అభివృద్ధికి రూ.500 కోట్లు విడుదల చేస్తానన్న సీఎం కేసీఆర్.. ఇచ్చిన హామీ మేరకు నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కొండగట్టు అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తామని రేవంత్ రెడ్డి తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE