ఈసారి తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు సంథింగ్ స్పెషల్గా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. తమ అంచనాలకు మించిన ఫలితాలు రావచ్చనే అభిప్రాయానికి ఇప్పటికే వచ్చేశారు.మూడోసారి ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించి తెలంగాణలో తమ పట్టు ఎంత ఉందో చెప్పడానికి సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారు.
మరోవైపు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న కాంగ్రెస్.. ఈ సారి తెలంగాణలో పాగా వేయలేకపోతే భవిష్యత్తులో తమ ఉనికే ఉండదనే భయంతో గెలుపు పైనే దృష్టి పెట్టింది. ఇక ఆడా, ఈడా కాదు.. తెలంగాణలోనూ తమ ప్రాభవం ఉందన్న విషయాన్ని చెప్పడానికి బీజేపీ..బీజేపీతో పొత్తుతో బరిలోకి దిగుతున్న జనసేన, యాక్టివ్ మార్క్ చూపిస్తూ జనాల్లోకి దూసుకుపోతున్న బీఎస్పీ ఇలా అన్ని పార్టీలు తమ దూకుడును పెంచుతూ నవంబర్ 30 న జరిగే ఎన్నికల సమరానికి సిద్ధం అయిపోతున్నారు. దీంతో ఈ సారి రాజకీయాలు రంజుగా ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇప్పటి వరకూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది పోటీ చేశారు. తలపండిన నేతలు, రాజకీయాల్లో తన మార్కును చూపించాలని ఆరాటపడే యువత, ఈసారైనా తనను నిరూపించుకోవాలనే మిడిల్ ఏజ్ వాళ్లు.. ఆకాశంలోనే కాదు.. అవకాశం ఇస్తే తామేంటో నిరూపిస్తామని చెబుతూ మహిళలు ఇలా ఎంతో మంది ఎన్నికలలో నామినేషన్లు వేశారు. ప్రజా తీర్పుకు తల ఒగ్గి ప్రజా క్షేత్రంలో నిలబడ్డారు. అయితే ఇప్పటి వరకూ జరిగినే ఏ ఎన్నికలలో కూడా ట్రాన్స్జెండర్ పోటీ చేయలేదు.
కానీ నవంబర్ 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటిసారి ఒక ట్రాన్స్జెండర్ పోటీచేయబోతున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సారథ్యంలో బీఎస్పీ .. ఈసారి అన్ని స్థానాల్లోనూ బరిలోకి దిగుతోన్న విషయం తెలిసిందే. 43 మంది అభ్యర్థులతో బీఎస్పీ తాజాగా ప్రకటించిన రెండో లిస్టులో వరంగల్ తూర్పు స్థానాన్ని చిత్తారపు పుష్పిత లయకు కేటాయించింది. ఎప్పుడుయినతే పుష్పితకు సీటు కేటాయించారో అప్పుడే ఈ విషయం టాక్ ఆఫ్ ది తెలంగాణ అయిపోయింది. ఎందుకంటే కరీమాబాద్ నివాసి అయిన పుష్పిత.. ట్రాన్స్జెండర్ కావడమే.
కొన్నాళ్లుగా పుష్పిత బీఎస్పీలో యాక్టివ్గా ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఆమెకు టికెట్ రావడంతో ట్రాన్స్జెండర్స్ సంబరాలు చేసుకుంటున్నారు. బీఎస్పీ కార్యకర్తలు ఆమె ఇంటికి చేరుకుని శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. అటు తనను ఈ ఎన్నికలలో గెలిపిస్తే వరంగల్ తూర్పు నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన మార్కు చూపిస్తానని పుష్పిత చెబుతున్నారు. విద్యావంతురాలిగా తానేంటో నిరూపించుకుంటానని ఆమె ధీమాను వ్యక్తం చేస్తున్నారు. తనకు టికెట్ కేటాయించడంపై పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు పుష్పిత కృతజ్ఞతలు చెబుతున్నారు. అయితే ఈ సారి తూర్పు వరంగల్ ప్రజలు తమ లీడర్గా ఎవరిని ఎన్నుకుంటారో అన్నది చూడాలి. ఒకవేళ పుష్పిత కనుక గెలిస్తే ఓ పొలిటికల్ హిస్టరీలో ఓ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసేసుకున్నట్లే అవుతుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE