టీఆర్ఎస్ మంత్రులు ఎక్కడా ఎలాంటి తప్పు చేయలేదని, అందుకే ఐటీ, ఈడీ, సీబీఐ ఎవరు పిలిచినా విచారణకు వెళ్తున్నారని పేర్కొన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన రాజకీయ ప్రత్యర్దులపైకి కేంద్ర సంస్థలను ఉసిగొల్పుతోందని, అయితే తెలంగాణలో మాత్రం వారి దాడులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కవిత తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆమె బుధవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల పరిధిలోని నాగిరెడ్డిపేటలో నిర్వహించిన టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. తెలంగాణలో గత నెల రోజులుగా టీఆర్ఎస్ మంత్రులే లక్ష్యంగా ఐటీ దాడులు చేస్తున్నారని, అయితే తమ నేతలు ఎవరూ తప్పు చేయలేదని, చట్టప్రకారమే వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారని తెలిపారు. అందుకే ఎవరూ భయపడట్లేదని, పిలవగానే విచారణకు హాజరవుతున్నారని కూడా ఆమె వెల్లడించారు.
అధికారులు అడిగేవాటికి అన్నిటికీ సమాధానాలు చెప్తారని, అవసరమైతే లెక్కలు, పత్రాలు ఇస్తారని ఇందులో దాపరికమేముందని అన్నారు. అయితే మరోవైపు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ బీజేపీకి చెందిన నేతలు దొరికిపోయారని, వారిని విచారణకు పిలుస్తుంటే మాత్రం భయంతో రావడం లేదని ఎద్దేవా చేశారు. ఒకవైపు విచారణనుంచి తప్పించుకోవడానికి కోర్టుల్లో కేసులు వేస్తున్నారని, మరోవైపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గుడుల దగ్గర దొంగ ప్రమాణాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ నేత బీఎల్ సంతోష్ అనే నేతకు సిట్ సమన్లు పంపిందని సంజయ్ మీడియా సమావేశం పెట్టి బాధపడుతున్నారని, మీరేతప్పు చేయకుంటే ఎందుకు భయపడుతున్నారు? అని ప్రశ్నించారు. బీజేపీ వాళ్ళు శ్రీరాముడు పేరు చెప్పి దౌర్జన్యం చేస్తున్నారని, ప్రజలు వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు.
ఇక ఇటీవలే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో పాదయాత్ర చేశారని, ఆయన ఏమి ఆశించి పర్యటించారో అర్ధం కావడం లేదని అన్నారు. రాహుల్ యాత్ర సమయంలో ఇక్కడ దక్షిణ తెలంగాణలోని మునుగోడులో ఉపఎన్నిక జరుగుతుంటే, ఆయన మాత్రం ఉత్తర తెలంగాణలో పాదయాత్ర చేసుకుంటూ వెళ్లారని అన్నారు. అయితే తన పర్యటన సందర్భంగా రాహుల్ గాంధీ తెలంగాణకు ఏం చేస్తారో చెప్పలేదని, ఆ పార్టీ నేతలకు కూడా ప్రజల సమస్యలపై స్ఫష్టత లేదని అన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు వీటన్నింటిపై దృష్టి పెట్టాలని, మనం చేసే మంచి పనులను ప్రచారం చేయాలనీ, అలాగే ప్రత్యర్థి పార్టీల విషప్రచారాన్ని తిప్పి కొట్టాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE