తెలంగాణ రాష్ట్రంలో వరంగల్-నల్గొండ-ఖమ్మం మరియు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 14న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరంగల్-నల్గొండ- ఖమ్మం జిల్లాలతో పాటు హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో శుక్రవారం నాడు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కోసం పని చేస్తున్న పార్టీ ఎన్నికల ఇంచార్జీలు , నాయకులు మరియు పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని, ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి విస్తృతంగా మూడు జిల్లాల్లో పర్యటిస్తూ విద్యావంతులను కలుస్తూ బరిలో ముందు వరుసలో ఉన్నారని చెప్పారు. మూడు జిల్లాలకు సంబంధించిన పార్టీ శ్రేణులంతా పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కోసం గట్టిగా పని చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క నల్గొండ జిల్లాకే 3 వైద్య కళాశాలలు వచ్చాయని, వరంగల్ నగరానికి పెట్టుబడులతో పాటు ఐటీ పరిశ్రమ పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. ఇక ఖమ్మం నగరంలో ఐటీ టవర్ ప్రారంభించామని, ఈ మూడు జిల్లాల్లో యువకుల నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం టాస్క్ ఏర్పాటు చేశామని చెప్పారు. మరోవైపు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానంలో టీఆర్ఎస్ పోటీ చేస్తున్న ఎస్. వాణిదేవికి ప్రత్యర్థుల నుంచి సైతం సానుకూల స్పందన వస్తుందన్నారు. టీఆర్ఎస్ పాలనలో, సీఎం కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ నగరం గత ఏడు సంవత్సరాలలో అద్భుతమైన ప్రగతిని సాధించిందని చెప్పారు.
ఉద్యోగాల కల్పనపై బీజేపీ దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలి: కేటీఆర్
హైదరాబాద్ నగరానికి వచ్చిన పెట్టుబడులు, పరిశ్రమల ద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభించాయని తెలిపారు. హైదరాబాద్ లో జరిగిన నగర అభివృద్ధిని నగర విద్యావంతుల దృష్టికి తీసుకుపోవాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రతి ఒక్క ఓటరును నేరుగా కలిసి టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలన్నారు. ఉద్యోగాల కల్పన విషయంలో బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలని సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 1,33,000 ఉద్యోగాలు ఇచ్చామని, మరో 50 వేల ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయబోతున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు టీఆర్ఎస్ ప్రభుత్వానికి పార్టీకి ఉన్న సంబంధం పేగు బంధం లాంటిదని, ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు అనేక మినహాయింపులు ఇచ్చి ప్రమోషన్లు ఇచ్చామని తెలిపారు. పార్టీ ఇంచార్జ్ లు రానున్న వారం రోజుల పాటు అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. క్షేత్రస్థాయిలో విద్యావంతుల నుంచి వస్తున్న స్పందనను పలువురితో మాట్లాడి ఈ సందర్భంగా కేటీఆర్ తెలుసుకున్నారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో మంత్రి కేటీఆర్ తో పాటు హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి గంగుల కమలాకర్ కూడా పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ