తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్ అర్హతపై కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్ లో ఇంటర్ వెయిటేజీ మార్కుల విధానాన్ని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంసెట్ నిబంధనల ప్రకారం ఎంసెట్ ప్రవేశ పరీక్ష రాయాలంటే ఇంటర్ లో విద్యార్థులు కనీసం 45 శాతం మార్కులను పొంది ఉండాలి. అయితే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను ప్రభుత్వం నిర్వహించకుండా, విద్యార్థులందరిని పాస్ మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్టుగా ప్రకటించారు. ఎంసెట్ లో అర్హత సాధించినప్పటికీ 45 శాతం మార్కుల నిబంధనతో పలువురు విద్యార్థులు ర్యాంకులు పొందలేకపోయారు. ఈ కారణంతో ఇంటర్ వెయిటేజీ మార్కులు విధానం తొలగించాలంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై స్పందించిన హైకోర్టు రెండో విడత ఎంసెట్ కౌన్సెలింగ్ ను నిలిపివేయాలని జేఎన్టీయూను ఆదేశించింది. ఈ క్రమంలోనే ఎంసెట్ నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇంటర్ ఉత్తీర్ణతతో పాటుగా ఎంసెట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు కౌన్సిలింగ్ లో పాల్గొని, ప్రవేశానికి అర్హులవుతారని ప్రకటించారు.
మరోవైపు శుక్రవారం నుంచే తుది విడుత కౌన్సెలింగ్ ప్రారంభిస్తున్నట్టు ఎంసెట్ కౌన్సెలింగ్ కన్వీనర్ నవీన్మిట్టల్ తెలిపారు. ఇప్పటి వరకు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కాని విద్యార్థులకు మరో అవకాశం ఇస్తున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వం ఇంటర్ వెయిటేజ్ మార్కులు తొలగించడంతో ఇంటర్ లో పాసై, ఎంసెట్ లో అర్హత సాధించిన వారికీ అక్టోబర్ 31 స్లాట్ బుకింగ్ కు అనుమతి ఇచ్చారు. అలాగే స్లాట్ బుకింగ్ ఆధారంగా నవంబర్ 1న సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది. ఇక అక్టోబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు సీట్ల కోసం వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చని తెలిపారు. తుది విడత కౌన్సిలింగ్ సీట్లను నవంబర్ 4 న కేటాయించనున్నారు. అదేవిధంగా నవంబర్ 4 నుంచి 7 తేదీవరకు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడంతో పాటు కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu