ప్రధాని నరేంద్ర మోదీ తన రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం నాడు గుజరాత్ చేరుకున్నారు. ఈ సందర్భంగా గుజరాత్లోని కేవాడియాలో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కింద వివిధ ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఆరోగ్య వనం, ఆరోగ్య కుటిర్, ఏక్తా మాల్, చిల్డ్రన్ న్యూట్రిషన్ పార్కులను ప్రధాని ప్రారంభించారు. 17 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఆరోగ్యవనంలో 380 జాతులకు సంబంధించిన 5 లక్షల మొక్కలు ఉన్నాయి. అలాగే ఆరోగ్య కుటిర్ లో శాంతిగిరి వెల్నెస్ సెంటర్ అనే సాంప్రదాయ చికిత్సా సౌకర్యం అందుబాటులో ఉంది. అందులో ఆయుర్వేదం, సిద్ధ, యోగా మరియు పంచకర్మ ఆధారంగా ఆరోగ్య సంరక్షణను అందించనున్నారు.
ఇక ఏక్తా మాల్ లో భారతదేశం నలుమూలల నుండి విభిన్న శ్రేణి హస్తకళలు మరియు సాంప్రదాయ వస్తువులను ప్రదర్శనకు ఉంచారు. 35000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ మాల్లో 20 ఎంపోరియాలు ఉన్నాయి, ఒక్కొక్కటి భారతదేశంలో ఒక నిర్దిష్ట రాష్ట్రాన్ని సూచిస్తుంది. ఈ మాల్ కేవలం 110 రోజుల్లో నిర్మించబడింది. అలాగే పిల్లల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి టెక్నాలజీ ఆధారిత న్యూట్రిషన్ పార్క్ ను 35000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఈ పార్కులో మిర్రర్ మేజ్, 5 డి వర్చువల్ రియాలిటీ థియేటర్ మరియు ఆగ్మెంటెడ్ రియాలిటీ గేమ్స్ వంటి వివిధ కార్యకలాపాల ద్వారా పిల్లలలో పోషక అవగాహన పెంచనున్నారు.
మరోవైపు గుజరాత్ పర్యటనలో భాగంగా ముందుగా గుజరాత్ మాజీ సీఎం, దివంగత కేశుభాయ్ పటేల్ కు ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. కేశూభాయ్ పటేల్ కుటుంబ సభ్యులను ప్రధాని పరామర్శించారు. ఇక అక్టోబర్ 31, శనివారం నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం సందర్భంగా నిర్వహించే ఏక్తా దివస్ పరేడ్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. నర్మదా నదీ తీరంలోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ వద్ద వల్లభాయ్ పటేల్కు నివాళులు అర్పించనున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu