స్వచ్ఛభారత్ లో తెలంగాణ రాష్ట్రం దేశంలో మరోసారి నెంబర్ వన్ గా నిలిచింది. వరసగా మూడోసారి కూడా స్వచ్ఛ భారత్ అవార్డును దక్కించుకుని హ్యాట్రిక్ సాధించింది. గత మూడేళ్లుగా తెలంగాణ వరసగా మొదటి స్థానాన్ని దక్కించుకుంటూ వస్తుంది. కాగా జిల్లాల కేటగిరీలో కరీంనగర్ జిల్లా దేశంలో మూడో స్థానంలో నిలిచింది. ఇదంతా సీఎం కేసీఆర్ చేపట్టిన పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలు, మిషన్ భగీరథ కార్యక్రమాల విజయ పరంపర ఫలితమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే అవార్డులు ప్రకటించిన కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. స్వచ్ఛ్ భారత్ లో అవార్డులు సాధించిన వాళ్ళందరినీ మంత్రి అభినందించారు.
ప్రతి ఏటా స్వచ్ఛ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, జిల్లాలు, బ్లాక్ లు, గ్రామ పంచాయతీల వారీగా అవార్డులు అందజేస్తుంది. తాగునీరు, పారిశుద్ధ్య విభాగంలో గత ఏడాది మూడు ప్రచారాలను కేంద్రం ప్రారంభించింది. అందులో నవంబర్ 1, 2019 నుంచి ఏప్రిల్ 20, 2020 వరకు “స్వచ్ఛ సుందర్ సముదాయిక్ షౌచాలయ (ఎస్ఎస్ఎస్ఎస్)” కార్యక్రమాన్ని, జూన్ 15 నుండి సెప్టెంబర్ 15 వరకు జిల్లాలు మరియు గ్రామాలను సమీకరించి వారి కమ్యూనిటీ మరుగుదొడ్ల నిర్మాణం-నిర్వహణకు “ సముదాయిక్ షౌచలయ అభియాన్ (ఎస్ఎస్ఎ) కార్యక్రమాన్ని, అలాగే ఆగస్టు 8, 2020 నుండి ఆగస్టు 15 వరకు చెత్త, వ్యర్థాలను తొలగించేందుకు గందగీ ముక్త్ భారత్ (డిడిడబ్ల్యుఎస్) కార్యక్రమాన్ని వారం రోజుల పాటు నిర్వహించింది. ఈ మూడు కేటగిరీల్లోనూ అద్భుత ఫలితాలు సాధించిన తెలంగాణ రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ గా నిలిచిందని కేంద్ర ప్రభుత్వ డిడిడబ్ల్యుఎస్ డైరెక్టర్ యుగల్ జోషీ తెలిపారు. అలాగే జిల్లాల కేటగిరీలో రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాకు మూడో స్థానం దక్కింది. ఈ మేరకు యుగల్ జోషీ, తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖకి లేఖను పంపించారు.
కాగా ఈ అవార్డులను అక్టోబర్ 2 వ తేదీన స్వచ్ఛ భారత్ దివస్ సందర్భంగా అందచేస్తారు. అయితే కరోనా సమయం కావడంతో జూమ్ ద్వారా, యూ ట్యూబ్ లైవ్ ద్వారా ఈ అవార్డులను కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వర్చువల్ పద్ధతిలో అందజేయనున్నారు. మన రాష్ట్రం నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఈ అవార్డుని స్వీకరిస్తారు. రాష్ట్రానికి వరసగా ఈ అవార్డులు రావడం పట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతోషం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు, ఇతర అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులను ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి అభినందించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu