వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సీజనల్ వ్యాధుల నుండి ప్రజలను కాపాడేందుకు మూడంచెల విధానం అనుసరించాలని అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించడం, వ్యాధి నిర్ధారణ చేయడం, త్వరితగతిన చికిత్స అందించడం వంటివి చేయాలన్నారు. మంగళవారం వెంగళరావు నగర్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయం నుండి రాష్ట్రంలోని ఏటూరు నాగారం, ఉట్నూర్, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్ వంటి నాలుగు ఐటిడిఏ పరిధిలోని జిల్లాల్లో సీజనల్ వ్యాధులపై మంత్రి హరీశ్ రావు టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ఈ విషయంలో పంచాయతీ రాజ్ సహా ఇతర శాఖలు, స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాజాత బృందంతో ప్రచారం చేయాలన్నారు. రాష్ట్రమంతటా వానలు మొదలయ్యాయని, ఒక్కసారిగా వాతావరణంలో జరిగిన మార్పుల వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని, దీంతో పాటు వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
“మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటివి పూర్తి నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. ఒకటి, రెండు కేసులు నమోదు కాగానే ఆ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించాలి. అవసరం ఉన్నచోట ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేయాలి. సత్వర చికిత్స అందించాలి. ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత లోపించడం, దోమలు, ఈగలు వ్యాప్తిచెందడం కారణంగా వ్యాధులు ప్రబలే ఆస్కారం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని పారిశుధ్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి. ముఖ్యంగా ఇంటి పరిసరాల్లో నీరు నిలువ ఉండడం వల్ల దోమలు, ఈగలు వృధ్ది చెంది అంటు వ్యాధులకు కారణమవుతాయి. అలా జరగకుండా చూసుకోవాలి. ఏటూరు నాగారం, ఉట్నూర్ , భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్ ఐటిడిఏల పరిధిలోని జిల్లాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఒక ప్రణాళిక ప్రకారం గిరిజన ప్రాంతాల్లో ఈ సీజనల్ వ్యాధుల బారి నుండి ప్రజలను కాపాడుకోవాలి. కరోనా లక్షణాలు, సీజనల్ వ్యాధుల లక్షణాలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు నిర్వహించాలి. సమీపంలోనీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల పరీక్షలు చేసే వెసులుబాటు ఉంది. ఐటిడిఏ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేయడం, అత్యవర పరిస్ధితులు ఎదుర్కొనేలా ప్రత్యేక వైద్య బృందాలు ఏర్పాటు చేసుకోవడం, సంబంధిత శాఖలతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవటం వంటివి చేయాలి. పంచాయతీరాజ్ శాఖ మరియు వైద్యశాఖలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవోలది. రోజువారి నివేదికలు తెప్పించుకొని క్షేత్రస్థాయిలో నమోదవుతున్న కేసులను పరిశీలించాలి. సంబంధించిన అధికారులను అప్రమత్తం చేయాలి. రెండు శాఖలు సమన్వయం చేసుకుంటూ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను కాపాడాలి” అని మంత్రి హరీశ్ రావు అధికారులకు సూచించారు.
ఈ సమీక్షలో హెల్త్ సెక్రెటరీ రిజ్వి, డిహెచ్ శ్రీనివాస్ రావు, కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేత మహంతి, టివివిపి కమిషనర్ అజయ్ కుమార్, డీఎంఈ రమేశ్ రెడ్డి, టీఎస్ఎంస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం జేడీ అమర్ సింగ్, ఐటీడీఏ పరిధిలోని 11 జిల్లాల కలెక్టర్లు సిక్తా పట్నాయక్, రాహుల్ రాజ్, భవిష్ మిశ్రా, గౌతం, అనుదీప్, శశాంక, భారతి, కృష్ణా ఆదిత్య, ఉదయ్ కుమార్, రాహుల్ శర్మ, గోపి, ఐటీడీఏ పీవోలు గౌతమ్, వరుణ్ రెడ్డి, అంకిత్, అశోక్, జిల్లా వైద్యాధికారులు, ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY