నవంబర్ 8, శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీ అయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశానికి చమురు కంపెనీల ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ భేటీలో రాష్ట్రానికి చెందిన అంశాలను చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ముఖ్యంగా కడప ఉక్కు పరిశ్రమకు ఎన్ఎండీసీ నుంచి ఖనిజం సరఫరా చేసేందుకు అంగీకారం కుదిరింది. త్వరలో దీనిపై ఎన్ఎండీసీ, ఏపీ ప్రభుత్వం మద్య అవగాహనా ఒప్పందం కుదుర్చుకోనున్నారు.
అదే విధంగా కాకినాడ–రాజమండ్రి ప్రాంతాల్లో పెట్రోలియం సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటు చేయనున్నారు. కాకినాడలో పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటుపై కేంద్ర, రాష్ట్ర అధికారులతో అత్యున్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో రానున్న ఐదు సంవత్సరాలలో పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు వంటి రంగాలలో రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు వస్తాయని భావిస్తున్నారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ముమ్మిడివరం ప్రాంతంలో మత్స్యకారులకు చెల్లించాల్సిన రూ.81 కోట్లను త్వరలో చెల్లిస్తామని ఈ సందర్భంగా ఓఎన్జీసీ అధికారులు తెలియజేసారు.
[subscribe]