మేడారం జాతర నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస్సులు నడపడంపై తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సమాయత్తం అవుతుంది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ సేవల ఏర్పాట్లపై బస్భవన్లో సోమవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రం నుండి, రాష్టేతర జిల్లాల నుంచి భక్తులు మేడారం జాతరకు తండోపతండాలుగా తరలిరానుండటంతో మొత్తం 3845 బస్సులు నడుపనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ ప్రకటించారు. కరీంనగర్ జోన్లో వరంగల్ , నిజామాబాద్ , అదిలాబాద్ , ఖమ్మం , కరీంనగర్ , మెదక్, తదితర జిల్లాలతో పాటుగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నుంచి ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా ఫిబ్రవరి 13 నుంచి 20 వరకు ఈ బస్సుల రాకపోకలు కొనసాగనున్నాయని పేర్కొన్నారు.
అనంతరం మేడారం జాతర రవాణా ఏర్పాట్లపై మంత్రి పువ్వాడ అజయ్ అధికారులకు కీలక సూచనలు చేశారు. మేడారం ప్రయాణీకులకు రవాణా సౌకర్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని , అదే సమయంలో విధులు నిర్వహించే సిబ్బందికి మంచి ఆహారాన్ని అందించడంతో పాటు మెరుగైన వసతి సదుపాయాలను కూడా కల్పించాలన్నారు. కోవిడ్, ఒమిక్రాన్ నుంచి రక్షించుకునేందుకు సిబ్బందికి స్పెషల్ డ్రైవ్ ద్వారా బూస్టర్ డోన్లను ఇప్పించాలని, హ్యాండ్ శానిటైజర్స్, మాస్కులను కూడా అందివ్వాలని ఆదేశించారు. డిపో నుంచి బయలుదేరే సమయంలో బస్సును పూర్తిగా శానిటైజేషన్ చేయాలన్నారు. అలాగే వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. లాభనష్టాలను బేరీజు వేసుకోకుండా భక్తులకు మెరుగైన రవాణా సేవల్ని అందించి మన్ననలు పొందే విధంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షల మేరకు మేడారం భక్తుల రాకపోకల సమయంలో రవాణా రంగం నుంచి ఎలాంటి నిరీక్షణ ఉండకుండా వివిధ ప్రాంతాల నుంచి అత్యధిక సంఖ్యలో బస్సులను నడపాలని మంత్రి పువ్వాడ అజయ్ సూచించారు .
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ