ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు జపాన్ ప్రధాని సనాయే తకాయిచి సమక్షంలో భారత్-జపాన్ ద్వైపాక్షిక బంధంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ప్రపంచాన్ని శాసిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతపై ఇరు దేశాలు కలసి కృషి చేయాలని నిర్ణయించాయి. భారత్కు ఉన్న సాఫ్ట్వేర్, ఏఐ నైపుణ్యాలకు, జపాన్ దేశపు తయారీ రంగానికి ఉన్న అంతర్జాతీయ సామర్థ్యాలు తోడై అద్భుతమైన ఫలితాలు సాధించాలన్న అవగాహన కుదిరింది.
ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో గురువారం నిర్వహించిన భారత్-జపాన్ 16వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో ఈ మేరకు చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సదస్సులో ఆర్థిక, రక్షణ, ఇంధనం సహా పలు కీలక రంగాల్లో విస్తృత సహకారానికి రెండు దేశాలు అంగీకారానికి వచ్చాయి. సెమీకండక్టర్లు, క్వాంటమ్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ మెటీరియల్స్, కీలక ఖనిజాలు, వ్యూహాత్మక తయారీకి సంబంధించి సరఫరా వ్యవస్థల బలోపేతానికి కలసి పనిచేయాలని నిర్ణయించారు.
నేటి అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల్లో ఆర్థిక, ఇంధన భద్రత ప్రాముఖ్యతను ఇరు దేశాలు గుర్తించి, దానికి అనుగుణంగా ఉమ్మడి కార్యాచరణను సిద్ధం చేశాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా పలు సంయుక్త కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నారు. గడిచిన ఏడాది కాలంలో భారత్-జపాన్ మధ్య కుదిరిన 100కు పైగా ఒప్పందాల ద్వారా సుమారు 10 బిలియన్ డాలర్ల (రూ. 95 వేల కోట్లు) జపాన్ పెట్టుబడులు భారత్కు రానున్నట్లు ప్రకటించారు.
వచ్చే పదేళ్ల కాలంలో 10 ట్రిలియన్ జపాన్ యెన్ల పెట్టుబడులను (సుమారు రూ. 5.92 లక్షల కోట్లు) ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు. ఇదే కాలంలో భారతదేశంలో తమ కార్యకలాపాలు నిర్వహించే జపాన్ కంపెనీల సంఖ్యను రెట్టింపు చేయనున్నారు. ఈ సదస్సులో జపాన్ ప్రధాని సనాయె తకాయిచిని ప్రధాని మోదీ ‘నా అందమైన చిట్టి చెల్లెమ్మ’ అంటూ ఆప్యాయంగా సంబోధించడం విశేషం.
ఈ శిఖరాగ్ర సదస్సు ద్వారా ఇరు దేశాల రక్షణ, ఆర్థిక రంగాలు మరింత బలోపేతం కానున్నాయి. తొలిసారిగా కుదిరిన రక్షణ భాగస్వామ్య డీల్ మరియు భారీ పెట్టుబడుల ప్రణాళికలు భారతదేశ పారిశ్రామిక అభివృద్ధికి సరికొత్త ఊపునివ్వనున్నాయి. వ్యూహాత్మక సాంకేతిక రంగాలలో జపాన్ భాగస్వామ్యం వల్ల దేశీయంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రపంచ సరఫరా గొలుసులో భారత్ కీలక భూమిక పోషించడానికి మార్గం సుగమం అవుతుంది.







































