అరుణాచల్ ప్రదేశ్లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వద్ద భారత్, చైనా దేశాల సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈనెల 9వ తేదీన తవాంగ్ సెక్టార్ వద్ద ఈ ఘటన జరిగినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు సోమవారం వెల్లడించాయి. జూన్ 2020లో తూర్పు లడఖ్లో జరిగిన అతిపెద్ద గాల్వాన్ లోయ సంఘటన తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో ఘర్షణ వాతావరణం నెలకొనడంతో సరిహద్దుల వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఇక భారత్, చైనాల మధ్య ఘర్షణలు జరిగినట్లు వార్తలు వచ్చిన ఒకరోజు తర్వాత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్, ఇతర ఉన్నతాధికారులు పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఘటన జరిగిన తీరుపై ఆరా తీశారు. కాగా ఈ ఘర్షణలో ఇరు దేశాలకు చెందిన కొందరు సైనికులకు గాయాలైనట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ 9 తెల్లవారుజామున ఇరుదేశాల సైనికులు ఘర్షణ పడ్డారని, కర్రలు మరియు పదునైన ఆయుధాలతో పరస్పరం కొట్టుకున్నారని రక్షణ మంత్రికి వివరించారు. సుమారు 300 మంది చైనీస్ సైనికులు బోర్డర్ దాటడానికి ప్రయత్నించగా, భారత సైన్యం సమర్ధవంతంగా తిప్పికొట్టినట్లు వారు వెల్లడించారు.
ఇదిలావుండగా.. తవాంగ్ సెక్టార్లో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ మంగళవారం పార్లమెంటును కుదిపేసింది. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టమైన ప్రకటన చేయాలని పలువురు కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. ఇతర ప్రతిపక్షాలు కూడా ఈ అంశంపై చర్చకు పట్టు బట్టడంతో సభ గంటపాటు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో లోక్సభలో రాజ్నాథ్ సింగ్ దీనిపై మాట్లాడుతూ.. భారతదేశ సరిహద్దులకు తగిన రక్షణ కల్పిస్తున్నామని సభకు హామీ ఇచ్చారు. మన దేశ సరిహద్దులను కాపాడటానికి మన బలగాలు కట్టుబడి ఉన్నాయని, దానిని సవాలు చేయడానికి చేసే ఏ ప్రయత్నాన్ని అయినా సరే అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. భారత ఆర్మీ ధైర్యసాహసాలను ప్రశంశించిన ఆయన ఈ ఘటనలో మన సైనికులెవరూ చనిపోలేదని స్పష్టం చేశారు. భారత సైనిక కమాండర్లు సకాలంలో జోక్యం చేసుకున్నారని, చైనా సైనికులను నిలువరించారని, దీంతో వారి బలగాలు వెనుదిరిగాయాయని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ