ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జూన్ 16, మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయినా వెంటనే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. సమావేశాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగం తర్వాత, బీఏసీ సమావేశం నిర్వహించి సభ ఎజెండా, సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే విషయాలను చర్చించనున్నారు. అనంతరం బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. సంక్షేమ పథకాలు, మేనిఫెస్టో లోని నవరత్నాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, గత సంవత్సరం ప్రవేశపెట్టిన రూ.2,27,975 కోట్ల బడ్జెట్ కంటే, ఎక్కువగానే బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శాసన మండలిలో మంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
బడ్జెట్ సమావేశాల సందర్భంగా ముందుగా సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి, 2020-2021 రాష్ట్ర బడ్జెట్కు మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. అలాగే 2019-20 సప్లమెంటరీ బడ్జెట్కు కూడా మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా పార్టీనేతలంతా నల్లచొక్కాలు ధరించి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాలను రెండు రోజులకే పరిమితం చేయబోతున్నారని, సభలో కరోనా నిబంధనలు పాటిస్తూ పలు ప్రజా సమస్యలపై చర్చ జరిగేలా 15 రోజులైన అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu