ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిగ్రీ, పీజీ పరీక్షల రద్దుపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టత నిచ్చారు. ప్రస్తుత కరోనా వ్యాప్తి పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణపై ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తున్నాం తప్ప, అసలు పరీక్షలు రద్దు ప్రశ్నే ఉత్పన్నం కాలేదని మంత్రి తెలిపారు. జూన్ 24, బుధవారం నాడు రాష్ట్రంలోని 16 యూనివర్సిటీల వీసీలతో మంత్రి సురేష్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షల నిర్వహణ, 2020-21 విద్యా సంవత్సరం ప్రణాళికపై ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తుంది.
మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, అన్ని యూనివర్సిటీలకు సంబంధించి పరీక్షలు నిర్వహించాల్సి వస్తే ఏం చేయాలి, అలాగే ఒకవేళ రద్దు చేయాల్సి వస్తే ఏమి చేయాలి అనే అంశాలపై పూర్తిగా కసరత్తు చేశామని తెలిపారు. ఈ విషయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి జూన్ 25, గురువారం నాడు నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. డిగ్రీ, పీజీ పరీక్షలు రద్దు చేస్తునట్టు ఇంకా ప్రకటించలేదని, రద్దుపై ఏ నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu