ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విషాదకర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సైతం కొందరు తమ చర్యలు ద్వారా మానవత్వానికి ప్రతీకగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో పెద్దపల్లిలో కరోనా రోగి మృత దేహాన్ని తరలించే విషయంలో ఓ డాక్టర్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిలో ఓ వ్యక్తి కరోనాతో చనిపోయాడు. అయితే కరోనా మృతదేహాన్ని స్మశానానికి తీసుకెళ్లేందుకు మున్సిపల్ సిబ్బంది ఒప్పుకోలేదు. కుటుంబ సభ్యులు గంటసేపు ప్రయత్నించినా ఎవరూ ముందుకు రాలేదు. ఎట్టకేలకు మునిసిపాలిటీ ట్రాక్టర్ అక్కడకు చేరున్నా గానీ, డ్రైవర్ భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
ఈ సంఘటన గురించి తెలుసుకున్న డాక్టర్ శ్రీరామ్ అక్కడికి చేరుకుని, సిబ్బంది సహాయంతో కరోనా రోగి మృతదేహాన్ని ట్రాక్టర్ లోకి ఎక్కించారు. అనంతరం పీపీఈ కిట్ ధరించి తానే డ్రైవర్ గా మారారు. ట్రాక్టర్ నడుపుతూ రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్మశానవాటికకు తీసుకెళ్లారు. నలుగురు కుటుంబ సభ్యులతో కలిసి కరోనా రోగి అంత్యక్రియలు పూర్తయ్యే వరకు డాక్టర్ శ్రీరామ్ అక్కడే వేచి ఉన్నారు. పెద్దపల్లిలో డిస్ట్రిక్ట్ సర్వీలెన్స్ ఆఫీసర్ గా డాక్టర్ శ్రీరామ్ పనిచేస్తున్నారు. ఈ ఘటనపై ఆయన మాట్లాడుతూ, కరోనా ఇన్ఫెక్షన్, వ్యాప్తి గురించి అవగాహన లేకపోవడం వలనే కొంతమందిలో భయం వలన ఈ పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. సరైన పీపీఈ కిట్ ధరించి వైరస్ వ్యాప్తి చెందకుండా కార్యక్రమాలు నిర్వహించవచ్చని చెప్పారు. సాధారణంగా మృతదేహాల నుంచి వైరస్ వ్యాప్తి చెందదని, ఆసుపత్రుల్లో ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుని ప్యాక్ చేస్తారని చెప్పారు. దేశంలో పలు చోట్ల కరోనా మృత దేహాల పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తున్న సమయంలో డాక్టర్ శ్రీరామ్ చూపిన మానవత్వం సోషల్ మీడియాలో పలువురి ప్రసంశలు అందుకుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu