విశాఖపట్నం సమీపంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. పరవాడలోని జవహరలాల్ నెహ్రూ ఫార్మాసిటీలో జూలై 13, సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాంకీ సీఈటీపీ సాల్వెంట్ ఫార్మాకంపెనీలో రాత్రి పూట ఒక్కసారిగా భారీపేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ల వలన మంటలు పెద్దఎత్తున ఎగసిపడడంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. మంటల ధాటికి అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకోలేక కొద్దిసేపు దూరంగా ఉండిపోయారు. అనంతరం 5 ఫైర్ ఇంజన్లు, రాంకీ కంపెనీకి చెందిన మరో మూడు ఫైరింజన్లుతో కలిసి రెండున్నర గంటలు శ్రమించి మంటలను పూర్తిగా అదుపు చేశారు. సమాచారం అందగానే అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
కాగా ఈ ఘటనలో సీనియర్ కెమిస్ట్ శ్రీనివాసరావు ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం ఉదయం శిథిలాల మధ్యలో శ్రీనివాసరావు మృతదేహాన్ని గుర్తించారు. అలాగే గాయాలపాలైన మరో కార్మికుడు మల్లేష్ను గాజువాకలోని ఆస్పుపత్రి తరలించారు. ఈ ఘటన సమయంలో మొత్తం ఆరుగురు కార్మికులు విధుల్లో ఉన్నట్టు తెలుస్తుంది. మిగిలిన వారంతా సురక్షితంగానే ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఇటీవలే ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో జరిగిన గ్యాస్ లీకేజీ ఘటన, సాయినార్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో గ్యాస్ లీకేజీ ఘటన చోటుచేసుకున్నాయి. ఇలా వరుస ఘటనలతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఈ అగ్ని ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu