ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ గతంలో తరలించిన అసెంబ్లీ ఫర్నీచర్ ను సోమవారం నాడు అసెంబ్లీ, పోలీసు, రెవిన్యూ అధికారుల బృందం స్వాధీనం చేసుకున్నారు. గుంటూరులోని కోడెల శివప్రసాద్ తనయుడు శివరామ్ కి సంబంధించిన గౌతమ్ హీరో షోరూములో ఉన్న అసెంబ్లీ ఫర్నీచర్ ను అధికారులు స్వాధీనం చేసుకుని వెలగపూడిలోని అసెంబ్లీకి తరలించారు. మూడు రోజుల క్రితం అసెంబ్లీ అధికారులు జరిపిన తనిఖీల్లో గౌతమ్ హీరో షోరూములో ఫర్నీచర్ ను గుర్తించారు, తరువాత ఈ విషయంపై తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడ చేసారు. షోరూము లో ఉంచిన ఫర్నీచర్ ను సోమవారం రాత్రి రెండు లారీల్లో వెలగపూడికి తరలించారు.
కోడెల కుమారుడి షోరూము నుంచి 70 వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు అసెంబ్లీ అధికారులు మొదటిగా తనిఖీలు చేపట్టారని, ఆ తరువాత వారు ఇచ్చిన ఫిర్యాదుతో తాము కూడ సోదాలు నిర్వహించారని చెప్పారు. మరో వైపు అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపు విషయంపై కోడెల శివప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఫర్నీచర్, ఇతర సామాగ్రిని తీసుకెళ్లేలా అసెంబ్లీ అధికారులను ఆదేశించాలని, లేని పక్షంలో వాటి వ్యయాన్ని చెల్లిస్తానని కోర్టుకు వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.
[subscribe]
[youtube_video videoid=vD13LahzbaM]