అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆగస్టు 5 న వైభవంగా భూమి పూజ జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా రామమందిరం నిర్మాణ పనులు ప్రారంభమయినట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. “శ్రీ రామ జన్మభూమి మందిర నిర్మాణం ప్రారంభమైంది. ఎల్ అండ్ టీ సంస్థతో పాటుగా సిబిఆర్ఐ రూర్కీ, ఐఐటి మద్రాస్కు చెందిన ఇంజనీర్లు ఇప్పుడు మందిరం సైట్ వద్ద మట్టిని పరీక్షిస్తున్నారు. నిర్మాణ పనులు 36-40 నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. భారతదేశం యొక్క ప్రాచీన మరియు సాంప్రదాయ నిర్మాణ పద్ధతులకు కట్టుబడి మందిరం నిర్మించబడుతుంది. భూకంపాలు, తుఫానులు మరియు ఇతర ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని కొనసాగేలా నిర్మించబడుతుంది. మందిరం నిర్మాణంలో ఇనుము ఉపయోగించబడదని” శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది.
“మందిరం నిర్మాణం లో భాగంగా రాతి పలకలను ఒకదానితో ఒకటి కలపడానికి రాగి ప్లేట్లు/పలకలను ఉపయోగించనున్నారు. రాగి ప్లేట్లు 18 అంగుళాల పొడవు, 30 మిమీ వెడల్పు మరియు 3 మిమీ లోతు ఉండాలి. మొత్తం నిర్మాణంలో ఇటువంటి 10,000 ప్లేట్లు అవసరం కావచ్చు. అటువంటి రాగి పలకలను ట్రస్టుకు దానం చేయాలని మేము శ్రీ రామ భక్తులను కోరనున్నాము. దాతలు ఈ పలకలపై వారి కుటుంబ పేర్లు, నివసించే స్థలం లేదా వారి కమ్యూనిటీ దేవాలయాల పేర్లను చెక్కవచ్చు. ఈ విధంగా రాగి పలకలు ఈ దేశం యొక్క ఐక్యతను సూచించడమే కాకుండా, మందిరం నిర్మాణానికి దేశం చూపిన సహకారానికి నిదర్శనంగా నిలుస్తుంది” అని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పేర్కొంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu