కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 20, గురువారం నాడు స్వచ్ఛ సర్వేక్షణ్-2020 అవార్డులను ప్రకటించింది. దేశంలో మొత్తం 4,242 నగరాలలో 1.87 కోట్ల పౌరుల స్పందనతో 28 రోజుల పాటు ఈ సర్వే నిర్వహించినట్టు తెలిపారు. అత్యంత పరిశుభ్రమైన నగరంగా వరుసగా నాలుగోసారి టైటిల్ ని గెలుచుకుని ఇండోర్ రికార్డు సృష్టించింది. ద్వితీయ, తృతీయ స్థానంలో సూరత్, నేవీ ముంబయి నిలిచాయి. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వివిధ కేటగిరీల్లో పలు స్వచ్చ సర్వేక్షణ్ అవార్డులు దక్కించుకుంది. 10 లక్షలకు పైగా జనాభా కలిగి, పరిశుభ్రతలో ఉత్తమ పనితీరు కనపరిచిన నగరాల్లో విజయవాడ నాలుగవ స్థానంలో, విశాఖపట్నం తొమ్మిదవ స్థానంలో నిలిచాయి. మరోవైపు పరిశుభ్రత విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ర్యాంక్ 28 నుండి 6 కి చేరుకుంది.
ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ సర్వేక్షణ్-2020 అవార్డులు గెలుచుకోవడంపై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందిస్తూ ట్వీట్ చేశారు. “భారత ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛసర్వేక్షణ్ -2020 అవార్డుల్లో 10 లక్షల పైన జనాభా గల నగరాల జాబితాలో 4వ స్థానంలో విజయవాడ, 9వ స్థానంలో విశాఖ నిలవడం ఆనందదాయకం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు ఆయా నగరాల అధికార యంత్రాంగానికి అభినందనలు” అని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu