జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి (యుఎన్) లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, మహాత్మా గాంధీపై తన ఆలోచనలను పంచుకున్నారు. ‘సమకాలీన ప్రపంచంలో మహాత్మా గాంధీ సిద్ధాంతాల ఔచిత్యం’ అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. గాంధీ 150వ జయంతి సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రత్యేకంగా రూపొందించిన స్టాంపును ఇతర దేశాల అధ్యక్షుల సమక్షంలో మోదీ ఆవిష్కరించారు. మహాత్మగాంధీపై ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఐరాస ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. గాంధీ భారతదేశానికి చెందినవారు, కానీ ఆయన సిద్ధాంతాలు భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదని చెప్పడానికి ఇక్కడ జరుగుతున్నా వేడుకే ఒక సజీవ ఉదాహరణ అని మోదీ చెప్పారు.
గాంధీజీని ఎప్పుడూ కలవని వారు కూడా ఆయన జీవితం నుంచి ప్రేరణ పొందారని చెప్పారు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అయినా, నెల్సన్ మండేలా అయినా, వారి నమ్మకాలకు, ఆలోచనలకు గాంధీజీ ఆశయాలే పునాది అని ఆయన అన్నారు. గాంధీజీ ప్రజాస్వామ్యం యొక్క నిజమైన బలాన్ని ఆనాడే నొక్కి చెప్పారు. ప్రజలను స్వయం సమృద్ధిగా ఉండాలని మరియు ప్రభుత్వాలపై ఆధారపడకూడదని నేర్పించారని, ఆ విధానాలే నేడు భారతదేశం ఎదురుకుంటున్న ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతుందని అన్నారు. గాంధీ తన జీవితం ద్వారా ప్రభావాన్ని సృష్టించాలని ఎప్పుడూ కోరుకోలేదు, కానీ అతని జీవితం కూడా ప్రేరణకు కారణమైంది, ఈ రోజు మనం అందరం ఎలా ఆకట్టుకోవాలి అనే యుగంలో జీవిస్తున్నాము, కాని గాంధీజీ మాత్రం ఎలా ప్రేరేపించాలి అనే దానిపైనే దృష్టి పెట్టారని మోదీ అన్నారు.
వాతావరణ మార్పు లేదా ఉగ్రవాదం, అవినీతి లేదా ప్రజా జీవితంలో స్వార్థం లాంటి రుగ్మతల నుంచి మానవాళిని రక్షించే విషయంలో గాంధీజీ ఆదర్శాలు మార్గదర్శకం అని, గాంధీజీ చూపిన మార్గం మంచి ప్రపంచానికి దారితీస్తుందని నమ్ముతున్నాను మోదీ పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ మరియు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, భూటాన్ ప్రధాని లోటే షెరింగ్, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్, సింగపూర్ ప్రధాన మంత్రి లీ హ్సీన్ లూంగ్, జమైకా ప్రధాన మంత్రి ఆండ్రూ మైఖేల్ హోల్నెస్, న్యూజిలాండ్ ప్రధాని జసిందా అర్డెర్న్ మరియు ఇతర దేశాధినేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
[subscribe]