కర్ణాటక రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి కీలక మలుపులు తీసుకొచ్చేలా ఉంది. మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి పదవిలో ఉండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సీఎం సిద్ధరామయ్యతో సహా పలువురి ఫోన్లను ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలతో దుమారం రేగిన సంగతి తెలిసిందే. కర్ణాటకలోని పలువురు రాజకీయ నాయకులు, అధికారులకు సంబంధించిన ఫోన్ లను అక్రమంగా ట్యాప్ చేసిన కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), మాజీ పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్ నివాసం, కార్యాలయంతో సహా బెంగళూరులోని పలు చోట్ల సోదాలు నిర్వహిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఏవైనా ఆధారాలు దొరుకుతాయోనని విస్తృతంగా పలు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. అలోక్ కుమార్ కుమారస్వామి హయాంలో నగర కమిషనర్ గా పనిచేసారు. ఆయన ప్రస్తుతం కర్ణాటక పోలీసుల అదనపు డైరెక్టర్ జనరల్ (ఎడిజి) గా పనిచేస్తున్నారు.
హెచ్డి కుమారస్వామి నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం రాజకీయ సంక్షోభాన్ని ఎదురుకున్న సమయంలో, ఆయన తన సహచరులు, పోలీసు అధికారులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫోన్లను ట్యాప్ చేసారని పలువురు ఆరోపించారు. బెంగుళూరు నగర పోలీస్ కమిషనర్ గా నియమితులైన భాస్కర్ రావు గతంలో జెడిఎస్ నేతలతో మాట్లాడిన ఓ ఆడియో టేపు వైరల్ అవ్వడంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనితో బీజేపీ, జెడిఎస్ లకు చెందిన ఎమ్మెల్యేలు సైతం తమ ఫోన్లు ట్యాపింగ్ కు గురయ్యాయని ఆరోపించారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు ఈ వ్యవహారంపై విచారణకు డిమాండ్ చేయడంతో యడియూరప్ప ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు కోరింది. ఆ క్రమంలోనే అలోక్ కుమార్ ఇంటిలో సోదాలు జరుగుతున్నాయి.
[subscribe]