ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత గ్రామాల రైతులు చేస్తున్న ఉద్యమానికి నేటితో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా రాజధాని ప్రాంతమైన రాయపూడిలో ‘అమరావతి రక్షణకై జనభేరి’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు టీడీపీ, బీజేపీ, జనసేన, సీపీఐ, సీపీఎం, ఆమ్ఆద్మీ సహా పలు పార్టీలు, రైతుసంఘాలు మద్దతు ప్రకటించాయి. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా మూడు రాజధానుల అంశంపై రెఫరెండానికి సిద్ధమా అని వైసీపీ నాయకులను చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు మూడు రాజధానులకు మద్దతుగా ఓటేస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని చంద్రబాబు సవాల్ విసిరారు. అలాగే అమరావతి ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని, అధికారంలోకి వచ్చిన 18నెలల్లో నిరూపించకుండా ఏం చేశారని చంద్రబాబు ప్రశ్నించారు.
ఈ సభలో పాల్గొనే ముందు విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారిని చంద్రబాబు దర్శించుకున్నారు. దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉద్దండరాయునిపాలెంలోని అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రదేశాన్ని చంద్రబాబు సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ సాష్టంగా నమస్కారం చేశారు. జై అమరావతి అంటూ నాయకులు, రైతులు నినాదాలు చేశారు. చంద్రబాబు వెంట టీడీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు, ఎంపీలు కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, బోడె ప్రసాద్, కేశినేని శ్వేత, తదితరులు ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ