అమెరికా కాన్సుల్ జనరల్ (హైదరాబాద్) జోయల్ రీఫ్మెన్తో పాటు, కాన్సులేట్ అధికారులు డేవిడ్ మోయర్, సీన్ రూథ్ తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మంగళవారం నాడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా జోయల్ రీఫ్మెన్ మాట్లాడుతూ తాము విశాఖపట్నంలో పర్యటించామని, అక్కడి వసతులు, సౌకర్యాలు తమకు ఎంతో సంతృప్తి ఇచ్చాయని తెలిపారు. ఈ నేపథ్యంలో విశాఖలో హబ్ ఏర్పాటుకు తమ ప్రభుత్వం ఆసక్తిగా ఉందని ఆయన వెల్లడించారు. దేశంలో ఇప్పటి వరకు ఒక్క అహ్మదాబాద్లో మాత్రమే అలాంటి హబ్ ఉందని చెప్పారు. కాగా ఢిల్లీలో ఉన్నట్లుగా విశాఖలోనూ అమెరికా ఇంక్యుబేటర్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ చేసిన విజ్ఞప్తికి అమెరికా కాన్సుల్ జనరల్ సానుకూలంగా స్పందించారు. విశాఖలో ఇంక్యుబేటర్ ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు.
అమెరికా–ఆంధ్ర మధ్య పరస్పర సహకారం మరింత పెంపొందేలా కాన్సుల్ జనరల్ చొరవ చూపాలని, ఆ దిశలో తాము కూడా కలిసి నడుస్తామని భేటీ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఆంగ్ల భాష ప్రాధాన్యం గుర్తించామని, అందువల్లనే అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం అమలు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ప్రాంతీయ ఆంగ్ల భాషా కార్యాలయం (రెలో)ను సీఎం గుర్తు చేసి, ఆ కార్యాలయం కార్యకలాపాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో 98 శాతం స్కూళ్లు ఇంగ్లీష్ లోనే బోధిస్తున్నాయని, టీచర్లకు ఇంగ్లీష్ భాషలో శిక్షణ ఇవ్వాలని యోచిస్తున్నామని ఈ విషయంలో రెలో తమతో కలిసి రావాలని సీఎం వైఎస్ జగన్ అభిలాషించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ