పర్మిట్ ఫీజులు, రోడ్ ట్యాక్సులు రద్దుచేసి టాక్సీల యజమానులు ఆదుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. “లాక్డౌన్ మూలంగా అన్ని రంగాల మాదిరే ట్యాక్సీలు నడుపుకొంటూ జీవించేవారు తీవ్ర కష్టాల్లో పడ్డారు. లాక్డౌన్ ఉన్నంత కాలం జన జీవనం స్తంబించడంతో అద్దెకు వాహనాలు తిప్పే పరిస్థితి ఎలాగూ లేదు. సడలించిన తరవాత కూడా ఉపాధి లభించే అవకాశాలు నామమాత్రమయ్యాయి. ఇన్ని ఇబ్బందుల్లో ఉండగా ట్యాక్సీలకు రోడ్ ట్యాక్స్, పర్మిట్ ఫీజులు చెల్లించాలని రవాణా శాఖ ఒత్తిడి చేయడం భావ్యం కాదు. వీరి బాధలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని” పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.
‘ఆర్ధికంగా నష్టపోయి, ఆ వాహనాలు రుణాలు కూడా చెల్లించలేని స్థితిలో ఉండగా ఈ నెలాఖరులోగా పన్నులు, రుసుములు అంటూ రాష్ట్ర రవాణా శాఖ చెప్పడంతో ట్యాక్సీల యజమానులు ఆందోళనకు లోనవుతూ ఉన్నారు. తమ బాధలను జనసేన పార్టీ దృష్టికి తీసుకువచ్చి గత మూడు నెలలుగా తమ వాహనాలు తిరగకపోవడంతో జీవనమే కష్టంగా మారిందనీ, ఇక పన్నులు ఎలా చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి బాధలను ప్రభుత్వం సానుభూతితో పరిగణనలోకి తీసుకోవాలి. రోడ్లపై తిరగని వాహనాలకు లాక్డౌన్ సమయంలో పర్మిట్ ఫీజు, రోడ్ టాక్స్ రద్దు చేయాలి. అలాగే సీట్ల కుదింపు ఉన్నంతవరకూ పన్నులలో 50% రాయితీ ఇవ్వాలి. ప్రజా రవాణా రంగంలో భాగమైన మాక్సీ టాక్సీ క్యాబ్స్ యజమానులు, వాటిపై ఆధారపడ్డ డ్రైవర్ల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని” పవన్ కళ్యాణ్ కోరారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu