ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని, ప్రముఖ సినీనటుడు, పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న చిరంజీవి, అనంతరం తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వారిని సాదరంగా ఆహ్వానించారు. చిరంజీవి సీఎం జగన్ కు పుష్పగుచ్ఛము అందించి, శాలువాతో సత్కరించారు. ఈ భేటీలో జగన్ తో పాటు ఆయన సతీమణి వై.ఎస్ భారతి కూడ ఉన్నారు. ఈ సందర్భంగా తాను నటించగా ఇటీవలే విడుదలై ఘన విజయం సాధించిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని వీక్షించాల్సిందిగా సీఎం జగన్ను చిరంజీవి కోరారు. అనంతరం జగన్ తో కలిసి భోజనం చేసారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టాక మొదటిసారిగా చిరంజీవి ఆయనతో భేటీ అయ్యారు.
కొన్ని రోజుల క్రితం తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను కలిసి ‘సైరా’ సినిమాను వీక్షించాల్సిందిగా చిరంజీవి కోరగా, ఆమె కుటుంబ సభ్యులతో కలిసి సినిమాని వీక్షించి అద్భుతంగా ఉందంటూ ప్రశంచించారు. స్వాతంత్ర్య పోరాటంలో తెల్ల దొరలపై తొలిసారిగా పోరాటానికి దిగిన, కర్నూలు ప్రాంతానికి చెందిన పోరాటయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా, ప్రముఖ డైరెక్టర్ సురేందర్రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు అభిమానులు, ప్రేక్షకుల ప్రశంసలే కాకుండా, సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు నుండి సైతం ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
[subscribe]