ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 15వ తేదీన అత్యంత ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5510 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ఆర్ధిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కే.సత్యనారాయణ అక్టోబర్ 13, ఆదివారం నాడు ఉత్తర్వులు జారీ చేసారు. ఈ పథకం కింద రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని ఆయా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని 15వ తేదీన నెల్లూరు సమీపంలోని కాకుటూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభిస్తారు. అనంతరం కౌలు రైతులకు కార్డులు పంపిణీ చేస్తారు. తర్వాత అక్కడ జరిగే బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
అక్టోబర్ 14, సోమవారం నాడు వ్యవసాయ మిషన్పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అమలయ్యే వైఎస్సార్ రైతు భరోసా పథకం, పంటల ధరలు, రబీ సాగు వంటి అంశాలపై మంత్రులు, వ్యవసాయ రంగ నిపుణులు, రైతు సంఘాల నేతలతో చర్చించారు. అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్ రైతు భరోసా కింద ఇవ్వాలనుకున్న రూ.12,500 లను 13,500 లకు పెంచుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఐదేళ్లపాటు ప్రతి సంవత్సరం రైతులకు రూ.13,500 అందజేస్తామని చెప్పారు. మూడో దశల్లో ఈ డబ్బును పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రైతు భరోసా ద్వారా దాదాపు 3 లక్షల మంది కౌలు రైతులకు మేలు చేస్తున్నామని, వారికీ రూ.13,500 అందజేస్తామన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో సుమారు 50 లక్షల మందికి పైగా రైతులకు లభ్ధి చేకూరుతుందని చెప్పారు.
[subscribe]