ఉత్తరప్రదేశ్ ప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 25వేల మంది హోంగార్డులను విధుల నుంచి తొలగిస్తూ, యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర బడ్జెట్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీపావళి పండుగకు కొద్దిరోజుల ముందుగా ఉద్యోగులను తొలగించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో హోంగార్డుల తొలగింపుపై, యూపీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు యూపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.
తొలగించిన హోంగార్డులలో ఎక్కువ మంది రాష్ట్రంలో ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద విధులు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా మిగిలిన 99వేల మంది హోంగార్డులను కూడ ఇకనుంచి నెలలో కేవలం 15 రోజులు మాత్రమే విధులకు హాజరవ్వాలని ప్రభుత్వం సూచించింది. రాష్ట్ర బడ్జెట్ పరిమితులనుసరించి 15 రోజులు మాత్రమే హోంగార్డులకు ఉపాధి కల్పిస్తామని పేర్కొంది. ఇటీవలే సాధారణ పోలీస్ కానిస్టేబుళ్లకు చెల్లించే విధంగానే హోంగార్డులకు సైతం డైలీ అలవెన్స్ అందజేయాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వేల సంఖ్యలో ఉన్న హోంగార్డులకు అలెవెన్స్ చెల్లింపు అధిక భారంగా మారడంతో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వారి తొలగింపుకే మొగ్గుచూపింది. అయితే బీజేపీ ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు విరుచుకు పడుతున్నాయి.
[subscribe]