ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని నిర్ణయించుకున్న ‘వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్టోబర్ 15, మంగళవారం నాడు లాంఛనంగా ప్రారంభించారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం కాకుటూరు గ్రామంలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ పథకానికి అర్హులైన రైతులకు చెక్కులు పంపిణీ చేశారు. రైతులకు సహాయం అందిస్తామని గతంలో ప్రజాసంకల్పయాత్రలో నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ ప్రకటించారు, ఇప్పుడు అదే జిల్లాలో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించడం విశేషం.
ముందుగా వైఎస్సార్ రైతు భరోసా కింద రైతులకు రూ.12,500 ఇవ్వాలనుకున్నారు. అయితే రైతులకిచ్చే సొమ్మును రూ.13,500 లకు పెంచుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఐదేళ్లపాటు ప్రతి సంవత్సరం రైతులకు రూ.13,500 అందజేస్తామని చెప్పారు. మూడో దశల్లో ఈ డబ్బును పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. జూన్ నెలలో రూ.2000 ఇప్పటికే అందించగా, మరో రూ.9,500 అక్టోబర్ నెలలో రైతు ఖాతాలలో నేరుగా జమచేస్తారు. మిగిలిన రూ.2000 లను సంక్రాంతి పండగా సందర్భంగా అందజేస్తారు. రైతు భరోసా ద్వారా దాదాపు 3 లక్షల మంది కౌలు రైతులకు మేలు చేస్తున్నామని, వారికీ రూ.13,500 అందజేస్తామన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో సుమారు 50 లక్షల మందికి పైగా రైతులకు లభ్ధి చేకూరుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా రైతాంగం, వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి భారీగా హాజరయ్యారు.
[subscribe]