మల్కాజ్ గిరి ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్ధతుగా ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన సందర్భంలో విధుల్లో ఉన్న పోలీసులకు ఆటంకం కలిగించి, విధి నిర్వహణలో ఉన్న ఓ అధికారిని తోసేస్తూ దురుసుగా ప్రవర్తించారనే కారణంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసారు. అక్టోబర్ 21, సోమవారం నాడు ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి సిద్ధమైన రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ రోడ్ నెం.48లోని ఆయన నివాసంలోనే ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా భారీగా పోలీసులను మోహరింపజేసి హౌస్ అరెస్ట్ చేసారు.
జూబ్లీహిల్స్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ కె.బాలకృష్ణారెడ్డి, సెక్టార్ ఎస్ఐ నవీన్ రెడ్డి, బంజారాహిల్స్ ఏసీపీ కే.ఎస్.రావు నేతృత్వంలో ఆయన ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి, బయటకు రాకుండా ఏర్పాట్లు చేసారు. అయితే మధ్యాహ్నం 12 గంటల సమయంలో రేవంత్రెడ్డి పోలీసుల ఆదేశాలను అతిక్రమిస్తూ ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. అడ్డుకున్న ఎస్ఐ నవీన్ రెడ్డి, ఇతర పోలీసులను తోసుకుని వెళ్లి, అప్పటికే సిద్ధం చేసుకున్న బైక్ పై ప్రగతి భవన్ కు చేరుకున్నారు. ఈ ఘటనలో గాయపడిన ఎస్ఐ నవీన్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో రేవంత్రెడ్డిపై 341, 332 సెక్షన్ల తో పాటు 353 నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసు నమోదు చేసారు. రేవంత్ రెడ్డితో పాటుగా ఆయన ముగ్గురు అనుచరులపైనా కూడ పోలీసులు కేసు నమోదు చేశారు.
[subscribe]